Wednesday, December 20, 2017

తుగ్లక్‌ మోదీ - గౌరి లంకేశ్

తుగ్లక్‌ మోదీ
 ("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి )

నరేంద్ర మోదీ తన తుగ్లక్‌ బుద్ధి చూపించుకున్నాడు.

నల్లడబ్బుకు వ్యతిరేకంగా  సమరం సాగిస్తానన్న మోదీ నిజానికి ఈ దేశంలోని అధికసంఖ్యాకులైన
పేద, మధ్యతరగతి ప్రజల పైనే యుద్ధం ప్రకటించాడు.

వెయ్యి, అయిదువందల రూపాయల నోట్లు రద్దుచేయడం ద్వారా ఆయన సామాన్య ప్రజల్ని
'మోసగాళ్ల'ను చేశాడు.

కడుపుకి తిండిలేని పేదలను దొంగల్ని చేశాడు.

పోయిన వారం ఈ నోట్ల రద్దు నేపథ్యంలో  కొన్ని విచిత్రమైన వార్తలు సామాజిక మాధ్యమాల్లో
ప్రచారమయ్యాయి. వాటిల్లో ముఖ్యమైనది కొత్తగా విడుదల చేస్తున్న రెండువేల రూపాయల నోట్లలో ఒక నానో చిప్‌
నిక్షిప్తమై ఉంటుందని. ఈ చిప్‌ ద్వారా ఎవరు, ఎక్కడ, ఎంత డబ్బు ఖర్చుపెట్టిందీ తెలుసుకోవచ్చట. అంతేకాక
ఎవరైనా అక్రమంగా ఈ రెండువేల నోట్లని దాచిపెడితే, ఆ స్థలాన్ని శాటిలైట్‌ ద్వారా కనిపెట్టి ఆదాయపన్ను శాఖవారు
దాడులు చేయగలరట. ఆ డబ్బును భూమిలోపల 120 మీటర్ల లోతులో పాతిపెట్టినా నానో చిప్‌ కనిపెట్టగలదట.

హిందీలో జీ న్యూస్‌ చానెల్‌, కన్నడలో మరొక న్యూస్‌ ఛానల్‌ ఈ స్వకపోలకల్పిత వార్తల్ని ఎంతో
ఉత్సాహంగా ప్రచారం చేసాయి. ఆ వార్త చదువుతున్న న్యూస్‌ రీడర్‌ సంతోషంతో, పెజావర్‌ స్వాములవారిలాగా, తన
కుర్చీలోనే ఎగిరెగిరిపడుతూ వున్నాడు. మోదీని సమర్ధించే మరో మహిళా యాంకర్‌ ఏకంగా రెండువేల రూపాయల
నోట్ల మీద మంగళయానం బొమ్మ ముద్రించింది శాటిలైట్‌ ద్వారా దాని ఆనుపానులు కనుక్కోవడానికే అని
ప్రకటించేసింది!!

వాట్సాప్‌, ఫేస్బుక్‌లలో కూడా దీనికి ఎంత ప్రచారం లభించిందంటే, గడిచిన వారం హుబ్బళ్లికి
వెళ్ళడానికి నేను ట్రెయిన్‌ ఎక్కినప్పుడు, నాతోపాటు బోగీలో ఉన్నవాళ్ళందరూ దీని గురించే చర్చిస్తున్నారు.

వాళ్ళ అమాయకత్వం చూసి, ''అదంతా అబద్ధం. అట్లాంటి చిప్‌ ఏదీ ఆ నోటులో లేదు'' అన్నాను.

నా మాట నమ్మబుద్ధికాని ఇద్దరు నడివయసు వ్యక్తులు, ''టీవీలో న్యూస్‌ వచ్చింది మేడం'' అన్నారు.

''టీవీలో వచ్చేదంతా నిజం కాదు'' అని చెప్పాను.

''అమెరికాలో కూడా ఇలాంటి చిప్‌ ఉన్న నోట్లు ఉన్నాయట'' అన్నారు వాళ్లు.

''ఎవరండీ ఆ మాటంది? ఎక్కడా ఆ రకమైన నోట్లు లేవు'' అన్నాను.

''అలాగైతే, ఈ నోట్లను రద్దుచేసి ఏం ప్రయోజనం?'' అని వాళ్లలో ఒకరు అన్నారు.
 
 ''మీరే ఆలోచించండి'' అన్నాను.

అప్పుడు పై బర్త్‌లో వున్న ఒక యువకుడు, ''ఏం ప్రయోజనమో తెలుసా? పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు
బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని, తిరిగి చెల్లించడం లేదు. అందువల్ల ప్రస్తుతం బాంకుల్లో డబ్బుల్లేవు. ఏదో ఒకటి చేసి ప్రజలే వాళ్ళ డబ్బుల్ని బ్యాంకుల్లో జమచేసేలా చెయ్యాలి. ప్రజలు తమ పాత నోట్లకి విలువ లేకుండా పోతుందన్న భయంతో హడావిడిగా వాటిని తీసుకెళ్లి బ్యాంకులను నింపుతున్నారు'' అన్నాడు.

''అలాగైతే దీని వలన నల్లడబ్బు సమస్య తీరదా?'' అని ఒకరు ప్రశ్నించారు.

''దొంగ నోట్ల సమస్య కొన్నాళ్ళపాటు ఉండకపోవచ్చు. అయితే అవేమీ అంత పెద్ద మొత్తంలో లేవు.
అయినా కొద్ది రోజుల్లోనే కొత్త నోట్లను కూడా నకలు చేస్తారు. అవినీతిపరుల్లో చాలామంది తమ అక్రమ సంపాదనను
ఆస్తి, బంగారం లాంటి వాటిల్లో పెడతారే తప్ప నగదు రూపంలో దాచుకునేది చాలా తక్కువ. ఆ కొంత డబ్బే ఇప్పుడు
రద్దయింది. ఏదేమైనా మోదీ చెప్పినట్లు మన దేశంలో ఉన్న నల్లడబ్బంతా బయటికొచ్చి మనందరి బ్యాంకు ఖాతాల్లో
15 లక్షలు వచ్చేమీ పడిపోవు '' అన్నాను.

''అవునా? నేను ఈ మోదీ ఏదో గొప్ప పని చేయడానికి బయలుదేరాడని అనుకున్నానే! చూడబోతే
మన జేబులోనే చెయ్యి పెట్టేటట్టున్నాడు'' అని వాళ్లిద్దరు నిట్టూర్చారు.

ఇవాళ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన దగ్గర రుణాలు తీసుకున్న 63 కంపెనీల  అప్పులన్నిటిని
మాఫీ చేసింది. ఆ 63 కంపెనీలు ఆ బ్యాంకుకు ఇవ్వాల్సినదెంతో తెలుసా? దాదాపు 7016 కోట్ల రూపాయలు.
దీనిలో లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్య ఎగ్గొట్టిన 1201 కోట్ల రూపాయలు కూడా ఉన్నాయి. ఒక పక్కన లక్షలాది
మంది ప్రజలు కష్టపడి పనిచేసి గడించిన తమ డబ్బును గంటలుగంటలు క్యూలో నిలబడి బ్యాంకుల్లో జమ చేస్తుంటే,
మరోపక్క విజయ్‌ మాల్య లాంటి వాళ్లు తమ సరదాలను తీర్చుకోవడానికి చేసిన అప్పును బ్యాంకులు మాఫీ
చేస్తున్నాయంటే, మోదీ ఎవరి పక్షమో సులభంగానే గ్రహించవచ్చు.

విదేశాల్లో పోగయిన నల్లడబ్బుని వెనక్కి తేవడం సైతం మోదీగారికి సాధ్యం కాలేదు. అక్కడి మన
రహస్య ఖాతాదారుల పేర్లను బయటపెట్టడం సైతం ఆయన వల్ల కాలేదు. ప్రతిఒక్కరి బ్యాంకు ఖాతాలో 15 లక్షలు
డిపాజిట్‌ చేస్తానన్న ఎన్నికల వాగ్దానం ఉత్తుత్తి కలగానే మిగిలింది. ఎన్ని కుంభకోణాలనైనా భరించవచ్చుగాని పేద,
మధ్యతరగతి భారతీయుల పొట్ట కొడుతుంటే ఎలా సహించడం?

పాపం ఎవరో వయోవద్ధుడు రోజువారీ ఖర్చుల కోసం డబ్బు తీసుకోవడానికి క్యూలో నిలుచుని
చనిపోయాడు. దానిపై ఒక బిజెపి ఉపాధ్యక్షుడి స్పందన ఏమిటో తెలుసా? ''రేషన్‌ దుకాణం ముందు లైన్లలో
నిలుచున్నప్పుడు కూడా జనం చనిపోతారు. అయితే ఏంటట?''

దేశంలోని అధికసంఖ్యాక ప్రజలు తన పిచ్చిచేష్టలతో విసిగిపోయి వున్నారని తెలిసాక కూడా మోదీ
''కాస్త ఓపిక పట్టండి. కొద్ది రోజుల్లో అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాను'' అని అభ్యర్థించడానికి బదులు, ''నేను
దేశాభివద్ధి కోసమే ఇదంతా చేస్తున్నాను. అది గుర్తించకుండా ఈ దేశాన్ని 70 ఏళ్ళు పరిపాలించినవారు నాకు
వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు'' అని ఆరోపణలు చేసాడు. ''అదేమిటి మారాజా, వాళ్ళ డబ్బు వాళ్ళు
తీసుకోవటానికే ఇన్ని కష్టాలు పడుతున్న జనమా 70 ఏళ్ళుగా ఈ దేశాన్ని పాలిస్తున్నది? నీకు వ్యతిరేకంగా కుట్ర
పన్నడం వాళ్ళకెలా సాధ్యం?'' అని ఆయనకి చెప్పేవారు ఆయన పార్టీలో ఒక్కరు కూడా లేకుండా పోయారు.

నోట్లరద్దు 'మాస్టర్‌ స్ట్రోక్‌', 'ట్రంప్‌ కార్డ్‌' అంటూ పొగిడిన కొన్ని ప్రసారమాధ్యమాలకి, మధ్యతరగతి
ప్రజలకి ఇప్పుడిప్పుడే దాని వెనకాల ఉన్న అసలు తంత్రం అర్థమవుతూ వుంది. కొత్త నోట్లలో ఏ అద్భుతమూ లేదని, దానివల్ల నల్లడబ్బు మాయమైపోయేది లేదని వాళ్ళకు తెలిసొచ్చింది. మోదీ అనాలోచిత చర్యల వల్లే అందరూ ఇలా కష్టపడాల్సి వస్తోందని బోధపడింది.

మోదీ ఇప్పటికి కూడా ''దేశం కోసం మరికొద్ది రోజులు మీరు ఇదంతా సహించాలి'' అంటున్నప్పటికీ
ఇది కొద్దిరోజుల్లో తీరే సమస్య కానే కాదు. సామాన్య ప్రజలు కనీసం మరో నాలుగు నెలల వరకూ చిల్లర కోసం కూడా
ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దీని దుష్ప్రభావం చాలా వ్యాపారాలపై పడింది. చేపలు కొనేవారు లేక
పశ్చిమ బెంగాల్‌లో జాలరులూ, వ్యాపారులూ కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. పంజాబ్‌లో విత్తనాలు
కొనటానికి డబ్బులేక రైతులు దిక్కుతోచకుండా ఉన్నారు. వాళ్లు విత్తనాలు కొనలేకపోతే త్వరలోనే వరి, గోధుమల
రేట్లు ఆకాశాన్నంటుతాయి. 'చేతిలో డబ్బు లేదు, కడుపుకి తిండీ లేదు' - ఇదీ దేశంలో లక్షలాదిమంది పరిస్థితి నేడు.

 ఇదే మోదీ చేసిన ఘనకార్యం.

జనాగ్రహం ఇప్పుడిప్పుడే బిజెపివారికి తగులుతోంది. పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ''నల్లడబ్బు మీద
మోదీగారు చేస్తున్న సర్జికల్‌ దాడిని ప్రశంసిస్తూ మీమీ ప్రాంతాల్లో  ఫ్లెక్సీబోర్డులు పెట్టించండి'' అని ఎం.పిలందర్నీ
ఆదేశించాడు. షా ప్రతిమాటనీ శిరసావహించే బిజెపి సభ్యులు ఈసారి మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. గుజరాత్‌కు
చెందిన ఒక పార్లమెంటు సభ్యుడు తప్పించి దేశంలో మరెక్కడా ఏ ఎం.పి. కూడా ఆ రకమైన ఫ్లెక్సీలు పెట్టించలేదు.

గుజరాత్‌ ప్రజలు కూడా మోదీకి వ్యతిరేకంగా మారారు. అక్కడ ఒక లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌
నియోజకవర్గంలో ఉపఎన్నిక జరుగుతున్నప్పుడు బిజెపి కార్యకర్తలు బ్యాంకుల ముందు లైన్లలో నిలుచున్న ప్రజల
దగ్గరకి కరపత్రాలు ఇవ్వడానికి వెళ్లారు. జనం తమని మెచ్చుకుంటారని వాళ్ళు ఆశించారట. కానీ ప్రజలు వారికి
ఇచ్చిందేమో చెంపదెబ్బలు.

మిత్రపక్షాలైన అకాలీ దళ్‌, శివసేనలు కూడా బిజెపికి వ్యతిరేకంగా మారిపోయాయి. కొందరు బిజెపి
నాయకులు సైతం మీడియా సమక్షంలోనే మోదీ విధానాలను విమర్శిస్తున్నారు. కాకపోతే తమ పేర్లు రాయొద్దని
చెపుతున్నారు. మోదీకి కూడా తన పొరబాటు తాలూకు తీవ్రత అర్థమౌతున్నట్టే ఉంది. అందుకే ఆయన
ఎక్కడికెళ్ళినా విచిత్రంగా తడబడుతున్నాడు.

ఇప్పటికే నోట్ల రద్దు వల్ల దేశం మొత్తమ్మీద 25 కంటే ఎక్కువమంది చనిపోయారు.
ఉత్తరప్రదేశ్‌లో కూతురి చికిత్స కోసం పాత నోట్లు తీసుకుని ఆసుపత్రికి వెళ్ళిన తల్లిదండ్రులను ఆసుపత్రివారు బయటకి పంపేయడం వల్ల వాళ్ళ బిడ్డ  కన్నుమూసింది. తన దగ్గర పాతనోట్లు మాత్రమే ఉండటం వల్ల గుజరాత్‌లో ఒక తల్లి తన ఇద్దరు పిల్లలకి తిండిపెట్టలేక నిస్సహాయతతో ఉరి వేసుకుంది.

కాన్పూర్‌లో గత కొద్ది నెలలుగా తన భూమిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడో యువకుడు. చివరికి
నవంబర్‌ 8 న అతని ప్రయత్నం ఫలించి అతనికి 70 లక్షల రూపాయలు బయానా రూపంలో లభించింది. అయితే
మరుసటి రోజే పెద్ద నోట్లు రద్దయ్యాయని తెలిసి గుండెపోటుతో చనిపోయాడు. తెలంగాణలో ఒక స్త్రీ తన భర్త చికిత్స
కోసమూ, కూతురి పెళ్లి కోసమూ భూమి అమ్మింది. తనకొచ్చిన 54 లక్షల రూపాయలూ ఇక చిత్తుకాగితాలతో
సమానం అని భయపడి ఆత్మహత్య చేసుకుంది.

        ఉడిపిలో బ్యాంకు తలుపులు తెరవడానికన్నా ముందే పొడవాటి క్యూలో నిలుచున్న ఒక వ్యక్తి గుండెపోటు వచ్చిఅక్కడే చనిపోయాడు.

ఇలా చనిపోయిన వారెవ్వరూ దొంగలు కాదు, నల్లడబ్బు దాచుకున్నవారూ కాదు. వాళ్ళెవరూ
అదాని, అంబాని, టాటా, బిర్లాలు కారు. కష్టపడి నిజాయితీగా పని చేసుకుని బతికే భారతదేశ సామాన్య ప్రజలు
వాళ్ళంతా. ఇక్కడి రైతులు, గహిణులు, మధ్యతరగతివారు. నల్లడబ్బు మీద ఆర్భాటంగా యుద్ధానికి బయలుదేరిన
మోదీ చేసిన తప్పిదానికి బలైన అమాయకులు వాళ్ళందరూ. వాళ్ళ మరణాల బాధ్యత  మోదీదే.

నిజానికి మోదీ నల్లడబ్బు మీద 'సర్జికల్‌ స్ట్రైక్‌' చెయ్యలేదు. అతను ఈ దేశంలోని నిస్సహాయ ప్రజల్ని
చావుదెబ్బ కొట్టాడు.

మోదీ తుగ్లక్‌ దర్బారు నుండి ఇంతకన్నా ఇంకేం ఆశించగలం? 
   

(గౌరి లంకేశ్‌ పత్రికె, 30 నవంబరు 2016)

తెలుగు అనువాదం : కే. ఆదిత్య
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు

ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి


అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com


No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌