Tuesday, October 17, 2017

మనకు తెలియని యం.ఎస్ - దేవదాసీ పుత్రిక నుంచి సంగీత సామ్రాజ్ఞి వరకు - టి. జే. ఎస్. జార్జ్ తెలుగు అనువాదం : ఓల్గా

యమ్‌.యస్‌. సుబ్బులక్ష్మి పేరు దక్షిణ భారతదేశం లోని కోట్లాది యిళ్ళల్లో సుపరిచితమైన పేరు. ఆమె పాట యిళ్ళల్లో, ఆలయాలలో, ఉత్సవాలలో మారుమోగని రోజు వుండదనటంలో అతిశయోక్తి లేదు. కేవల ప్రజారంజకము, ప్రజాదరణేకాదు ఉత్తర, దక్షిణభారతదేశ సంగీత విద్వాంసులనూ, సంగీత ప్రియులను సమ్ముగ్ధం గావించిన ప్రతిభ ఆమెది. 1916లో మదురైలో ఒక సామాన్య దేవదాసి కుటుంబంలో షణ్ముగవడివు అనే వైణికురాలికి జన్మించిన యమ్‌.యస్‌. సుబ్బులక్ష్మి ''భారతరత్న'' పురస్కారానికి చేరుకున్న క్రమం, ఆమె జీవిత గమనం కేవలం ఆసక్తికరంగా వుండటమే కాదు. ఆధునిక భారతదేశంలో కులం, జండర్‌ యెలాంటి పరిణామాలను పొందాయో, యెన్ని సంక్లిష్ట, భిన్న సందర్భాలను యెదుర్కొన్నాయో, ఆ వివక్షలను యెదుర్కునేందుకు స్త్రీలు యెలాంటి సాహసాలు, పోరాటాలు, ప్రయోగాలు చేశారో, యెలా రాజీపడ్డారో తెలియజేప్పే ఒక చారిత్రక సామాజిక శాస్త్ర పాఠం. అగ్రవర్ణ పురుషుల ఆక్రమణలో శతాబ్దాలుగా చిక్కుబడిన కర్ణాటక సంగీతం ఆలపించిన స్వేచ్ఛా గీతం యమ్‌. యస్‌. సుబ్బులక్ష్మి.

ఈ పుస్తకంలో టి.జె.యస్‌ జార్జ్‌ కేవలం ఆమె జీవిత కథను మాత్రమే చెప్పలేదు. కర్ణాటక సంగీత భౌగోళిక సామాజిక, రాజకీయ స్వరూప స్వభావాల సారాంశంలో యమ్మెస్‌ యెక్కడ నిలబడి ప్రకాశిస్తున్నదో , ఆ స్థానమూ ఆ ప్రకాశమూ యెలా సాధ్యమయ్యాయో విశ్లేషించి, వివరించి, పోల్చి చెప్పాడు. కర్ణాటక సంగీతపు లోతుపాతులను కూడా. ఈ పుస్తకం తెలియజెబుతుంది.
మనకు తెలియని యం.ఎస్ - 
దేవదాసీ పుత్రిక నుంచి సంగీత సామ్రాజ్ఞి వరకు 
- టి. జే. ఎస్. జార్జ్ 
తెలుగు అనువాదం : ఓల్గా 
పేజీలు; 240, వేల ,150/-


No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌