Tuesday, July 4, 2017

బొజ్జా తారకం నలుపు సంపాదకీయాలు

బొజ్జా తారకం నలుపు సంపాదకీయాలు


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ 1980లో ఆరంభమైంది. దళిత అంశాలపట్ల మేం ప్రత్యేక శ్రద్ధ కనపరచటమన్నది కూడా దాదాపుగా అదే సమయంలో మొదలైందని చెప్పొచ్చు. డా|| బి.విజయభారతి గారు రచించిన  బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జీవిత చరిత్ర (1982) మేం ప్రచురించిన తొలి పుస్తకాల్లోనే ఉంది. ఆ తర్వాత 1984లో మరాఠీ దళిత కథా సంకలనాన్ని తెలుగులోకి తెచ్చాం. 'శూద్రులెవరు?' అన్న అంబేడ్కర్‌ రచననూ అదే సంవత్సరం ప్రచురించాం. 1985లో జరిగిన కారంచేడు ఘటన సామాజికంగా, రాజకీయంగా పెద్ద కుదుపునే తీసుకువచ్చింది. హెచ్‌బీటీ విషయంలో కూడా దాన్నో ముఖ్యమైన మైలురాయిలా చెప్పుకోవచ్చు. ఆ దారుణకాండ అనంతరం పెల్లుబికిన ఉద్యమం ఎంతటి ప్రభావవంతంగా నడిచిందో వర్ణించటానికి మాటలు చాలవు. దళితులు సాగించిన

ఉద్యమాల్లో సుదీర్ఘకాలం పాటు నిలకడగా జరిగిన అద్భుత ఉద్యమం ఇది. ఈ ఉద్యమ సమయంలో చర్చలకు ఒక వేదిక అవసరమన్న బలమైన నమ్మకంతో హెచ్‌బీటీ సిరిల్‌ రెడ్డి, బొజ్జా తారకం, మరి కొంతమంది కలిసి 'నలుపు' పత్రికను ప్రారంభించారు. అప్పటి వామపక్ష పార్టీలూ, ఉద్యమాలన్నీ కూడా కులం విషయంలో తాము అనుసరించాల్సిన వైఖరిపై ఇంకా స్పష్టత తెచ్చుకోలేదు. మరోవైపు షెడ్యూల్డు కులాల సంఘాలన్నీ కూడా 'సంక్షేమ' దృక్పథంతోనే పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రారంభమైన 'నలుపు' పత్రిక... దళితుల గొంతుగా, అట్టడుగు వర్గాల సమస్యలు, ఆలోచనలు, ఆవేదనలన్నింటికీ అక్షర రూపంగా నిలిచేందుకు ప్రయత్నించింది. నలుపు మొదటి సంపాదకవర్గ సమావేశం 1988 మార్చి 12న ఉదయం 11 గంటలకు హెచ్‌బీటీ ఆఫీసులోనే జరిగింది. దాదాపు ఏడాది కసరత్తు అనంతరం 1989 ఏప్రిల్‌లో తొలి సంచిక వెలువడింది.

నలుపు- 'ప్రజా పక్ష పత్రిక' అనే పేరుతో వెలువడేది. పేరుకు తగ్గట్లుగానే నలుపు నిబద్ధమైన వామపక్ష ఉద్యమ మేధావుల నుంచి దళిత బహుజన ఆలోచనాపరుల వరకూ అందరినీ భాగస్వాములను చేస్తూ విశాలమైన చర్చా వేదికగా అవతరించింది. దీన్ని  తీసుకురావటం వెనక ఎంతగానో శ్రమించింది బొజ్జా తారకం. ఆయన కవి, రచయిత, న్యాయవాది, ఉద్యమకారుడు. హైకోర్టులో న్యాయవాదిగా పని చేసేవారు. ఇలా ఎన్నో వ్యాపకాలతో తన మీద ఎంతో పని భారం ఉన్నప్పటికీ 'నలుపు' కోసం ఆయన కచ్చితంగా సమయం కేటాయించి, ప్రత్యేక శ్రద్ధతో పని చేశారు. నలుపును ప్రజాపక్ష పత్రికగా తీసుకురావటం గురించి ఆయన మాటల్లో.. ''ప్రజలంటే అందరూ ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతం బాధలకు, దోపిడీకి, హింసకు గురవుతున్న వాళ్ళు, హక్కులు కోల్పోతున్న వాళ్ళందరూ ప్రజలనే ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రకటించింది నలుపు! ప్రత్యేకంగా దళితుల కోసం పత్రిక పెట్టటంగానీ, వ్యాసాలు రాయటంగానీ దీనిలో భాగమే...''

'నలుపు'కు బొజ్జా తారకం సంపాదకులు కాగా హెచ్‌బీటీ సిరిల్‌రెడ్డి ప్రచురణకర్త. సంపాదకవర్గంలో కె. బాలగోపాల్‌, డి. నరసింహారెడ్డి, కంచ ఐలయ్య, పి.ఎల్‌. విశ్వేశ్వర రావు, ఆర్‌. అఖిలేశ్వరి ఉన్నారు. నలుపును ప్రజలు తమ పత్రికగా సొంతం చేసుకున్నారు. వ్యాసాలు, క్షేత్ర నివేదికల వంటివి రాయటమే కాదు, పత్రికను స్వయంగా అమ్మిన

వాళ్ళున్నారు. రకరకాల రూపాల్లో 'నలుపు' పనిలో పాలు పంచుకున్నవాళ్ళు ఎంతోమంది.

1989-95 మధ్య పత్రిక ఐదేళ్ళ పాటు 'నలుపు' విజయవంతంగా నడిచింది. పోలీసులు దీన్ని కూడా విప్లవ పత్రికలా భావిస్తూ ఎక్కడికక్కడ స్వాధీనం చేసుకుంటున్నా కూడా పత్రిక రైల్వేస్టేషన్లలో, బస్టాండ్లలో... రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా దొరుకుతూనే ఉండేది. ప్రజలు దీన్ని అంతగా అక్కునజేర్చుకున్నారు.

'నలుపు' ప్రతి ఒక్కరి జీవితాలను స్పృశించింది. హెచ్‌బీటీలో మాలో కూడా సరి కొత్త స్పృహ నింపింది. వామపక్ష ఆలోచనా ధోరణిలో ఎక్కడెక్కడ అంతరాలున్నాయన్నది వారికి బలంగా ఎత్తి చూపింది. దళితులకు వారి నిత్యజీవన పోరాటాల్లో అండగా నిలబడింది. దళిత రచయితలు, కార్యకర్తలకు కీలకమైన వేదికగా నిలిచి, వారి రచనలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. వామపక్షాలకూ, దళిత వర్గాలకూ మధ్య అంతరాలను పూడ్చే దిశగా అవగాహనా పూరితమైన చర్చలకు దోహదపడింది. అప్పట్లో 'నలుపు'లో పనిచేసిన ఉపసంపాదకుల్లో గుడిపాటి, జగన్‌రెడ్డి, చంద్రమౌళి, ఎస్‌. జయ, వై. నాగేశ్వర రావు, ఎస్‌.మల్లారెడ్డి ఇలా ఎంతోమంది తర్వాతి కాలంలో మంచి రచయితలుగా, జర్నలిస్టులుగా నిలబడ్డారు.

1995లో ఆగిపోయే నాటికి 'నలుపు' దాదాపు దాని లక్ష్యాలను పాక్షికంగానైనా అందుకుందనే చెప్పొచ్చు. భిన్న వర్గాల వారిని, భిన్న నేపథ్యాల నుంచి వచ్చే ప్రజలను దళిత అనుకూల ఉద్యమాల్లో భాగస్వాములను చెయ్యటం, దళితేతరుల్లో కూడా దళిత అంశాలపట్ల స్పృహ పెంచటం, దళిత రచయితలకూ, కార్యకర్తలకూ అవసరమైన ఒక వేదికను అందించటం - వీటన్నింటిలోనూ 'నలుపు' కీలక మలుపుగా నిలిచిందన్నది నిస్సందేహం!
-హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్రతులకు, వివరాలకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,

ప్లాట్ నెం.85. బాలాజీ నగర్,

గుడిమల్కాపూర్, హైదరాబాద్- 500006

ఫొన్ నెం:23521849

పేజీలు; 183, వేల ,120/-


బొజ్జా తారకం 'నలుపు వ్యాసాలు '

బొజ్జా తారకం 'నలుపు వ్యాసాలు


తెలుగు రాజకీయాలకు సంబంధించినంతవరకు 1989-1995 మధ్యకాలం - అంటే కారంచేడు మారణకాండ అనంతరం జన చైతన్యం ఉవ్వెత్తున ఎగసిపడిన కాలం.  సామాజిక, రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక రంగాలన్నీ ఒక కుదుపునకు గురైన కాలం. అన్ని ముఖ్యమైన సమస్యలపై ఆ రోజుల్లో విస్తృతమైన చర్చలు జరిగేవి. అదే కాలంలో నలుపు పత్రికలో బొజ్జా తారకం ఎంతో సాహసోపేతంగా, లోతైన పరిశీలనతో, ప్రత్యక్ష పోరాటానుభవంతో రాసిన సంపాదకీయాలు, వ్యాసాలు ఆనాటి తరానికి ప్రశ్నించడం, సంఘటితమవడం, ఎదురుతిరగడంలో మార్గనిర్దేశనం చేశాయి. మతోన్మాదం, కులోన్మాదం మళ్లీ పడగవిప్పి బుసకొడుతున్న ఈ రోజుల్లో వాటి ఆవశ్యకత మరింత వుంది.
--------------------------------------------------------------------------------------------------------------------------

అగ్రకుల దౌష్ట్యానికీ, వర్గ దోపిడీకీ గురవుతున్న ప్రజల పక్షాన జీవితాంతం రాజీలేని పోరాటం సల్పిన బొజ్జా తారకం (1939-2016) వృత్తి రీత్యా సీనియర్‌ న్యాయవాది.
ఆయన నిరంతరం అధ్యయన శీలి, బహుముఖ ప్రజ్ఞాశాలి.
అపారమైన న్యాయశాస్త్ర వైదుష్యంతో అటు న్యాయ పోరాటాలనూ, ఇటు ఉద్యమ సారధ్యాన్నీ శక్తివంతంగా నిర్వర్తించారు.
భారత రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
కారంచేడు, చుండూరు, లక్షింపేట మారణకాండల ప్రతిఘటనలలో రాజీలేని పోరాటం సల్పారు. దళితులను సంఘటిత పరిచే కార్యక్రమాలకే పూర్తికాలం వెచ్చించిన ఆయన ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ స్థాపనలో కీలక పాత్ర పోషించారు.
మానవ హక్కుల పౌర హక్కుల పరిరక్షణకై విస్తృతంగా కృషి సల్పిన ఆయన తన ప్రసంగాలు రచనల ద్వారా తన భావజాలాన్ని ప్రచారం చేశారు.
ఆయన రచనల్లో పోలీసులు అరెస్టు చేస్తే (1981),
నది పుట్టిన గొంతుక (1983),
కులం వర్గం (1996),
నాలాగే గోదావరి (2000),
దళితుడు-రాజ్యం (2008),
నేల నాగలి మూడెద్దులు (2008),
ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు (2012),
ఎస్సీ, ఎస్టీ నిధులు విదిలింపు మళ్లింపు (2012),
పంచతంత్రం (2012),
చరిత్ర మార్చిన మనిషి (2016) వీరి రచనల్లో ముఖ్యమైనవి.


ప్రతులకు, వివరాలకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,

ప్లాట్ నెం.85. బాలాజీ నగర్,

గుడిమల్కాపూర్, హైదరాబాద్- 500006

ఫొన్ నెం:23521849

పేజీలు; 283, వేల ,200/-



హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌