Sunday, December 14, 2014

కనీస గుర్తింపు కూడా కష్టమే - డా.విజయభారతి



కనీస గుర్తింపు కూడా కష్టమే 

బోయి భీమన్న కూతురిగా ఆమె ఖ్యాతిని ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. బొజ్జా తారకం భార్యగా పలుకుబడితో ప్రాచుర్యంలోకి రాలేదు.ఆమె రచనే ఆమె ఉనికి. ఆమె సృజనే ఆమె అస్తిత్వం. ‘తెలుగు సాహిత్యకోశం’, ‘పురాణస్త్రీల కథలు’, అంబేద్కర్, పూలే జీవితాల పై చేసిన రచనలు తెలుగులో ఆమెను గట్టి విమర్శకురాలిగా నిలబెట్టాయిడిసెంబర్ 13  హైదరాబాద్ సారస్వత పరిషత్ హాలులో హైదరాబాద్ బుక్ట్రస్ట్, అన్వేషి వంటి  మహిళాసంఘాల ఆధ్వర్యంలో విజయభారతికి సన్మానం జరగనున్న సందర్భంగా ఆమె  పరిచయం ఆమె మాటల్లోనే..

చదవడం అలవాటు

చిన్నప్పటి నుంచి చదవడం బాగా అలవాటు. అదీ నాన్న- బోయి భీమన్నగారి వల్లే. అయితే ఆయన రచనలను  చాలా పెద్దయ్యాకే చదివాను. నాన్న మా చిన్నప్పుడు రామాయణ, మహాభారతాలు చెప్తుండేవారు. చాలా వివరంగా, విపులంగా, విశ్లేషణాత్మకంగా చెప్పేవారు. ప్రభావం నా మీదుంది. కానీ వాటికి సంబంధించిన రచనలు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు.

అంబేద్కర్ పుస్తకం... పూలే సీరియల్

సహజంగానే మహిళలకు మగవాళ్ల మద్దతు సంపూర్ణంగా లభించదు. నా విషయంలోనూ అంతే. అయితే వెనక్కిలాగిన సందర్భాలు లేవు. పుస్తకాలు రాయడంలో బొజ్జా తారకంగారు నన్ను కొంత డెరైక్ట్ చేశారు. ముఖ్యంగా అంబేద్కర్ జీవితం మీద పుస్తకం రాయడానికి ఆయన ప్రోత్సాహమే కారణం. తర్వాత గౌతు లచ్చన్నగారు పెట్టిన  పత్రిక కోసం  పూలే జీవితాన్ని సీరియల్గా రాయడం మొదలుపెట్టాను. కొన్నాళ్లకి పత్రికను మూసేశారు. సగంలోనే ఉండిపోయిన సీరియల్ను పూర్తి చేశాను. పుస్తకం వేద్దామని వాళ్లను వీళ్లను అడిగాను. చూద్దాంలే అన్నారు కానీ ఎవరూ పట్టించుకోలేదు. చివరకు మేమే సొంత డబ్బులతో ఫస్ట్ ప్రింట్ వేశాం.
 
పురాణాల మీద...

 తెలుగు అకాడమీకి రాకముందు  నిజామాబాద్ విమెన్స్ కాలేజ్లో పదకొండేళ్లు లెక్చరర్గా పనిచేశాను. తెలుగు అకాడమీలో ఉన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ కోసం పురాణాలను మామూలు ధోరణిలోనే చెప్పాను. అప్పటికి వాటి మీద నాకు ఐడియాలజీ లేదు. పూలే గురించి రాసిన తర్వాతే పురాణాలకు  విశ్లేషణాత్మాక వ్యాఖ్యానం జోడించి రాయొచ్చు అనిపించింది. అకాడమీలోని తెలుగు పుస్తకంలో శ్రీకృష్ణ మధురానగర ప్రవేశం అని పాఠం ఉండేది. శ్రీకృష్ణుడు, బలరాముడు ఇద్దరూ మధురానగరిలో అడుగుపెట్టి రాజుగారి కోసమని తీసుకెళ్తున్న పూలదండల్ని లాక్కొని తమ మెడలో వేసుకోవడం, గోపికల వస్త్రాలను అపహరించడం లాంటి అల్లరి పనులన్నీ చేస్తుంటారు. నిజానికి ఇవన్నీ రౌడీ చేష్టలు. పురాణపురుషులకు రౌడీ చేష్టలను అంటగట్టడం వాటిని మనం సమర్థించడం విచిత్రంగా అనిపించింది. సాధారణ తెలుగు లెక్చరర్లకు ఇలాంటి సందేహాలు రావు (నవ్వు). అకాడమీలో ఉండడం వల్ల ఆంథ్రోపాలజీసోషియాలజీ లాంటి పుస్తకాలు చదవడం, పరిశీలించడం వల్ల నా ఆలోచనా ధోరణిమారి ఉండొచ్చు.

 సాహిత్యకోశం..

 తెలుగు అకాడమీలో మంచి పోస్ట్లకు దళితులు పనికిరారు, వాళ్లకు పాండిత్యం ఉండదు అనే భావన ఉండేది. అకాడమీలో నా పోస్ట్ రీసెర్చ్ ఆఫీసర్ ఇన్ టెర్మినాలజీ. తెలుగు సాహిత్య కోశమనేది  ఒక కూర్పు. నన్నయ్యకు ముందు నుంచి క్రీ..1850 వరకు ఒక వాల్యూమ్, క్రీ. 1850 నుంచి క్రీ.. 1950 వరకు ఒక వాల్యూమ్... అంటే మొత్తం రెండు వాల్యూమ్స్గా తీసుకురావాలనుకున్నారు. అదోప్రాజెక్ట్కాని మూలనపడి ఉంది. టెర్మినాలజీలో నేను రీసెర్చ్ ఆఫీసర్ని కదా. అయినా కూడా అసలు పని చెప్పకుండా డిక్షనరీలోంచి ఎత్తిరాసే పని అప్పజెప్పేవారు. అలాంటి వివక్ష వాతావరణంలో డెరైక్టర్ వెంకటస్వామిగారు నాకు, ఇంకొకరికి కలిపి మూలనపడున్న తెలుగు సాహిత్యకోశం ప్రాజెక్ట్ని అప్పజెప్పారు. మిగిలినవాళ్లంతా గగ్గోలు. పైకి చెప్పలేరు. దాంతో సహాయనిరాకరణ చేసేవారు. లైబ్రరీలో ఉన్న పుస్తకాలను ఇచ్చేవాళ్లు కాదు. ఇలా చాలా అవస్థపెట్టారు. అయినా ప్రాజెక్ట్ పూర్తిచేశాంఫస్ట్ వాల్యూమ్ పుస్తకంగా ప్రింట్ అయి వచ్చాక వీళ్లు ఊరుకోలేదు. తప్పులు వెదకడం మొదలుపెట్టారు. బయటి పత్రికల్లోసాహిత్యకోశం నిండా తప్పులుఅని వ్యాసాలు రాశారుఆఖరికి దీని మీద కమిటీ కూడా   వేశారు. కమిటీవీళ్లు గగ్గోలుపెడుతున్నంతగా ఏమీలేదు. చూసుకోక పాతవే కొన్ని క్యారీ అయ్యాయి, ఇంకొన్ని అచ్చుతప్పులున్నాయంతే. రెండోదీ వీళ్లే వేయొచ్చు. వీళ్లు సమర్థులేఅని నివేదిక ఇచ్చింది. దాంతో సాహిత్యకోశం సెకండ్పార్ట్ కూడా మేమే చేశాం. స్త్రీలకు ప్రాజెక్ట్ ఇచ్చినా బాగా చేయగలరు అని రుజువు చేశాం. ఇదంతా 1980 నాటి సంగతి.

రచనల్లో స్త్రీ..

 పురాణాల్లోని స్త్రీల గురించి రాయడానికి స్ఫూర్తి, ప్రేరణ అంతా నేను చదివిన పుస్తకాల నుంచి పొందిందే. శరత్ నవలల్లోని స్త్రీల పాత్రలు కూడా. ఇవన్నీ చదివి  ఎక్కడో రివోల్ట్ అయి ఉంటాను. అదే నా రచనల ద్వారా బయటికి వచ్చి ఉంటుంది. నా రచనలు చదివి ఎవరో ఎలీట్ అవుతారు అన్న ఆలోచనతో ఎప్పుడూ రాయను. కులం వల్ల బాధపడ్డానా? స్త్రీ కావడం వల్ల బాధపడ్డానా అంటే రెండింటి వల్లా పెద్దగా బాధపడలేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నేను చేసిన సాహిత్యకోశం చాలా మంచి వర్క్. అది ఎన్సైక్లోపీడియా. దాన్ని ఎవరో అప్పర్కాస్ట్ వాళ్లు చేసి ఉంటే ఎన్నో సన్మానసత్కారాలు జరిగి ఉండేవి. మాకు కనీసం గుర్తింపు రాలేదు. పైగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ మాత్రం రెండు రకాల వివక్షను ఎదుర్కొన్నాను. ఇక భవిష్యత్ ఆలోచన చెప్పాలంటే నోరి నరసింహశాస్త్రిరుద్రమదేవిలాంటి చారిత్రక రచన చేయాలని కోరిక. చేస్తానేమో తెలీదు.
 ..............................................................................  - సరస్వతి రమ

(సాక్షి (ఫామిలీ పేజి) 13-12-2014 సౌజన్యంతో)


హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన డా. విజయభారతి రచనలు: 

1) బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితచరిత్ర
2) మహాత్మా జ్యోతిరావు ఫూలే జీవితచరిత్ర
3) మహిళల హక్కులు డా.అంబెద్కర్ దృక్పధం
4) పురాణాలు - కులవ్యవస్థ
5) సత్యహరిశ్చంద్రుదు
6) దశావతారాలు
7) షట్చక్రవర్తులు
8) వ్యవస్థను కాపాడిన రాముడు
9) రామాయణ మునులు - మతంగుడు, విశ్వామిత్రుడు, శంబూకుడు

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌