Thursday, December 13, 2012

పంచతంత్రం (నవల) రచన: బొజ్జా తారకం ...

పంచతంత్రం (నవల)  రచన: బొజ్జా తారకం ...

కారంచేడు (1985) నుంచి లక్ష్మింపేట (2012) వరకూ దళిత ఉద్యమాలలో కీలకపాత్రవహిస్తూ న్యాయపోరాటాలు చేస్తూ రాజకీయ సామాజిక రంగాలను ప్రభావితం చేస్తున్న రచయిత బొజ్జా తారకం కలం నుంచి రూపుదిద్దుకున్న ఈ నవల అట్టడుగు వర్గాల బాధామయ జీవితాలకు దర్పణం పడుతుంది.

కారంచేడులో అగ్రవర్ణాలవారు దళితులపై సాగించిన అమానుష మారణకాండకు నిరసనగా 1984లోనే బొజ్జాతారకం గారు హైకోర్టులో గవర్నమెంట్‌ ప్లీడర్‌ ఉద్యోగానికి రాజినామా చేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ సహవ్యవస్థాపకుడిగా దళితుల నిరసనోద్యమానికి దశాబ్దకాలంపాటు వెన్నుదన్నుగా నిలిచారు. అగ్రకుల దౌష్ట్యానికీ, వర్గ దోపిడీకీ గురయ్యే ప్రజల పక్షాన రాజీలేని పోరాటం సాగించే ఆయన ఇప్పటికీ దళితులను సంఘటితపరిచే కార్యక్రమాలకే తన పూర్తికాలాన్ని వెచ్చిస్తున్నారు.

భారత రిపబ్లికన్‌ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. మానవ హక్కుల ఉద్యమాల్లో ఎంతో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయితగా కూడా ఆయనకు మంచి పేరుంది. వీరి రచనల్లో ''పోలీసులు అరెస్టు చేస్తే'', ''కులం-వర్గం'', ''నది పుట్టిన గొంతుక'', ''నేల నాగలి మూడెద్దులు'', ''దళితులు-రాజ్యం'' ప్రముఖమైనవి.

పంచతంత్రం నవల గురించి రచయిత మాటల్లోనే ...

'' ఈనవల ఇలా సాగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇలా రాయాలనీ అనుకోలేదు. ఈయీ పాత్రలు, ఈయీ సన్నివేశాలు ఉండాలనీ అనుకోలేదు. ముగింపు ఇలా ఉండాలనీ అనుకోలేదు. వరదపొంగులా అది అ లా సాగిపోయింది. నవల ఇలా మొదలుపెట్టాలని మాత్రం అనుకున్నాను. అంతే. ఆ తర్వాత నా చేతుల్లో లేపోయింది.

పాత్రలు, సన్నివేశాలు, అ లా అ లా అనుకోకుండా సాగిపోయాయి. హఠాత్తుగా తెరమీదికి అనుకోని వ్యక్తులు వచ్చినట్టు చాలా పాత్రలు నవలలోకి వచ్చేశాయి. చెప్పాపెట్టకుండా బంధువులు ఇంటికి వచ్చినట్టు, తలుపు తోసుకుని లోపలికి వచ్చినట్టు ఈ పాత్రలు వచ్చేశాయి. నాకే ఆశ్చర్యం వేసింది, ఎలా వచ్చాయా అని. అయితే అన్నీ నాకు తెలిసిన పాత్రలే కాబట్టి వాళ్ల చుట్టూ, వాళ్లతో కథ అ ల్లుకుపోయాను. ఒక జీవితానికి సంబంధించిన కథ కాదిది. వేలాది, లక్షలాది జీవితాలకు సంబంధించిన గాధ, వేదన, ఆవేశం, ఆకాంక్ష. నలభై ఏళ్లుగా రాయాలనుకున్న నవల....

ఇందులోని సంఘటనలు అన్నీ గొప్పవి. సన్నివేశాలూ పాత్రలూ అంతే. అయితే వాటిని నేను పూర్తిగా చిత్రీకరించలేకపోతే లోపం నాది, పాత్రలది కాదు. ఈ పాత్రలన్నీ మనముందే తిరుగుతున్నాయి. ...''



పంచతంత్రం (నవల)
రచన: బొజ్జా తారకం
290 పేజీలు, వెల: రూ.100/-




ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 006.

ఫోన్‌ నెం. 040-2352 1849

ఇమెయిల్‌:  hyderabadbooktrust@gmail.com

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌