Friday, May 27, 2011

నిరంతర ఘర్షణ ప్రధాన ఇతివృత్తం - 'రాముడుండాడు రాజ్జిముండాది' పుస్తక సమీక్ష - ఎస్‌.రామకృష్ణ (పాలపిట్ట మాస పత్రిక)


డా. కేశవరెడ్డి అభిమానిగా ''రాముడుండాడు రాజ్జిముండాది'' నవల చదివాను. ఆయన మిగతా రచనల కంటే ఇది భిన్నంగా వుంది. ఇంత సరళంగా, సింగిల్‌ లేయర్‌లో మరే ఇతర నవల లేదనిపించింది. అయితే కథను దృశ్యమానం చేయడంలో డా. కేశవరెడ్డి ముద్ర ఇక్కడ కూడా కన్పిస్తుంది.

ఉదాహరణకు 11 వ భాగంలో ''అది పౌర్ణమి వెళ్లిన తరువాతి రాత్రి. సందె చీకటి దట్టంగా అ లముకుని వుంది. కూలిపోయిన కొలిమి దాపున ఉన్న సత్రం నక్షత్రాల కాంతిలో లీలగా కనిపిస్తున్నది. మందంగా వీస్తున్న గాలి పాటకు బూడిద తొలిగిపోవడంతో పొయ్యిలోని నిప్పు కణికలు నిగనిగలాడుతో కనిపించసాగాయి. కొలిమి వెనుకనున్న వెంపలి చెట్లలోను, జిల్లేడు చెట్లలోను అసంఖ్యాకములైన మిణుగురు పురుగులు అవిరామంగా ఎగురబోతున్నాయి.'' మొత్తం నవలకు ఈ వాక్యాలు బీజప్రాయాలు.

చితికిపోతున్న గ్రామీణ జీవితాలు, ఆదరణ కోల్పోతున్న కులవృత్తులు, ఆధునికత దెబ్బతో కుంగిపోయి ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ, ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్న వివిధ కులాలవారు, ఈ పరిస్థితి నుండి విముక్తి కోసం నిరంతరం సాగే పోరాటం ''రాముడుండాడు రాజ్జిముండాది'' ఇతి వృత్తం.
దీన్ని దృశ్యమానం చేయడానికి డా.కేశవరెడ్డి ఈ సన్నివేశం ఎంచుకున్నారు.

ఒక రైతు చేతిలో కూల్చివేయబడ్డ కంసాలి కొలిమి, అందులో ఇంకా ఆరని నిప్పు కణికలు, జరుగుతున్న దారుణాన్ని మౌనంగా తిలకిస్తున్న మిణుకు మిణుకుమనే నక్షత్రాలు, అవిరామంగా ఎగరాలని చూసే మిణుగురు పురుగులు. ఓ అద్భుత దృశ్యం.

పైకి కేవలం ఆర్థి సమస్యగానే కనబడే గ్రామీణ ఆర్థికవ్యవస్థ సంక్షోభానికి కేశవరెడ్డి మానవీయతను జోడించారు. కంసాలి కొలిమిలోని ఆరని నిప్పులు వృత్తిపనివారి తరగతి నైపుణ్యంగా మనం అర్థం చేసుకోవాలి. ఆకాశ,లోని నక్షత్రాలు కాస్పిక్‌ వాస్తవికతకు తార్కాణంగా, చెట్లలోని మిణుగురులు నిరంతర ఆశావాదులైన గ్రామీణులకు ప్రతీకలుగా తీసుకోవచ్చు.

ఆశ్చర్యకరంగా ఈ చాప్టర్‌లోనే బైరాగి పాత్ర ద్వారా డా. కేశవరెడ్డి ప్రస్తుత సమాజ సంక్షోభానికి కారణం వివరిస్తాడు. తంబూర మీటుతూ బైరాగి వీరబ్రహ్మంగారి తత్వాలు పాడుతున్నాడు. బ్రహ్మంగారు తన శిష్యుడు సిద్ధయ్యకు లోకం తీరు వివరిస్తున్నాడు. ''మానవ సంబంధాలలోని రాక్షసత్వాన్ని, సృష్టి యొక్క నిరర్థకతను'' అతను విపులీకరిస్తున్నాడు అంటూ, మళ్లీ నేపథ్య దృశ్యాన్ని వర్ణించిన కేశవరెడ్డి ఎట్లా ''గాలి వీచే కొద్ది పొయ్యిలోని బూడిద తొలిగిపోయి నిప్పులు బయటపడుతున్నాయో'', ఎట్లా కొమ్మలను అంటిపెట్టెకున్న మిణుగురు పురుగులు కదులుతున్నాయో చెబుతాడు. ఈ ప్రపంచంలో ప్రతీదీ కదులుతుంది. కాకపోతే వాటి వేగం, గమనం విషయంలో ఒక్కోరిది ఒక్కో అంచనా.

బైరాగి దగ్గరకు వచ్చిన యువకుడు ''లోకమంతా ఇట్టానేనే సామీ?'' అని అడుగుతాడు. బైరాగి దీర్ఘంగా నిట్టూర్చి ''లోకం అంతా ఇట్లనే'' అని సమాధానం ఇస్తాడు. అంతేకాదు, ''ఎవని లోకం వానిదిగా వుంది'' అని ముగిస్తాడు.

ఒక స్థాయిలో ''రాముడుండాడు రాజ్జిముండాది'' ను కేవలం గ్రామీణ వ్యవస్థ చితికిపోవడానికి ఆధునికత, సరళీకృత ఆర్థిక విధానాలే కారణమని చెప్పే నవలగానో, కేవలం పట్టణాలకు వలస పోవడమే కుల వివక్షకు పరిష్కారమని చెప్పే రచనగానో చూసేవారుండొచ్చు. కానీ ఫ్యూడల్‌ సమాజానికి, ఆధునిక పట్టణీకరణకు మధ్య జరిగే సంఘర్షణలో అణగారిన కులాల వారికి, కొన్ని నష్టాలూ, ఎక్కువ లాభాలూ జరిగాయని చెప్పడానికి కూడా ''రాముడుండాడు రాజ్జిముండాది'' తార్కాణంగా నిలుస్తుంది.
నిజానికి ఆర్థికాంశాలు ఎంతగా మనల్ని ఆలోచింపజేసినా, నవల చదువుతున్నంతసేపు కేశవరెడ్డి మార్కు కథనం మనల్ని డామినేట్‌ చేస్తుంది.

పెద్దనాయుడు (పెద్ద భూస్వామి), ముత్యాల నాయుడు (పెద్దనాయుడి పెద్ద పాలేరు), కోనిగాడు (పెద్దనాయుడి దగ్గర 30 ఏళ్లుగా జీతం చేసిన ముదుసలి మాల కులస్తుడు), పుల్లిగాడు (కోనిగాడి కొడుకు, మంచి జీవితం కోసం చెన్నై వలస వెళ్లిన యువకుడు), తిరిపాల నాయుడు (చితికపోయిన రైతు), గుడిపూజారి, చేతివృత్తినే నమ్ముకుని ఊరిమీద ప్రేమ చావని, శ్రమకు ప్రతిఫలం లేని కంసాలి, ''రాముడుండాడు రాజ్జిముండాది''లో ప్రధాన పాత్రలు.

ఇందులో క్లుప్తతకు కేశవరెడ్డి ఇచ్చిన ప్రాధాన్యత కొన్నిచోట్ల బాగుంది. నవలలో ప్రధాన విలన్‌ పెదనాయుడే అయినా, అతడు ఎక్కడా మనకు కనబడడు అతడి ప్రభావం ముత్యాల నాయుడి ద్వారా మనకు అర్థమవుతుంది.
వెట్టిచాకిరిని కొనసాగిస్తూనే పైకి దయామయుడిగా కన్పించడానికి పెదనాయుడి ప్రయత్నాలు ఆధునిక విలన్‌లకు దగ్గరగా ఉంటాయి. బహుశ ఎవరైనా ఈ నవలను సినిమాగా తీస్తే, చివరన కోనిగాడు తన బాండ్‌ పేపర్లను తెచ్చుకోవడానికి దొర ఇంటికి వెళ్లినప్పుడు పెదనాయుడిని, ఓ రంగుల కుర్తా వేసుకున్న ఆర్టిస్టుగా చూపిస్తే బాగుంటుంది. పైకి ఎంత తియ్యగా మాట్లాడినా, లాభనష్టాల విషయంలో అత్యంత కర్కశంగా వ్యవహరించే కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఇవాళ్టి ఫ్యూడల్స్‌కు ఆదర్శం.

అన్నిరకాల భ్రమలు దూరమైనా ఊరి మీద మమకారం చావకపోవడం మానవీయ లక్షణం. కన్నీళ్లతోనే ఉన్న ఊరిని వదిలి పట్నం బయల్దేరిన ఐదుగురు- కోనిగాడు, పుల్లిగాడు, కంసాలి, తిరిపాలనాయుడు, పూజారి- మన ఊళ్లలో కన్పించే వివిధ సామాజిక వర్గాలకు ప్రతినిధులు. అయితే వీళ్లు పట్నంలో మెరుగైన జీవితం గడుపుతారా? దశాబ్దాలపాటు ఉన్న ఊళ్లో అనుభవించిన కష్టాలు గట్టెక్కుతారా? ''రాముడుండాడు రాజ్జిముండాది'' అంటూ వలసపోయే చిత్తూరు ప్రాంత గ్రామీణుల ఆశావాదమే ఈ ప్రశ్నలకు జవాబు.

- ఎస్‌. రామకృష్ణ
(పాలపిట్ట మాస పత్రిక)
సమీక్షకుని సెల్‌ నెం. 924 636 4326



1 comment:

  1. v డాక్టర్కెశవరెడ్డిగారినవల సెరీల్గా వస్తుంటె చదివాను.మునెమ్మనవల మాత్రం
    వివాదాస్పదమైనది.రాయలసీమగ్రామీణజీవితాలను వాస్తవికంగా చిత్రించె
    మంచిరచయిత.సమీక్షకుల వ్యాఖ్యానంతొ ఎకీభవిస్తున్నాను.--డా .రమణారావు.ముద్దు డాక్టర్కెశవరెడ్డిగారినవల సెరీల్గా వస్తుంటె చదివాను.మునెమ్మనవల మాత్రం
    వివాదాస్పదమైనది.రాయలసీమగ్రామీణజీవితాలను వాస్తవికంగా చిత్రించె
    మంచిరచయిత.సమీక్షకుల వ్యాఖ్యానంతొ ఎకీభవిస్తున్నాను.--డా .రమణారావు.ముద్దు డాక్టర్కెశవరెడ్డిగారినవల సెరీల్గా వస్తుంటె చదివాను.మునెమ్మనవల మాత్రం
    వివాదాస్పదమైనది.రాయలసీమగ్రామీణజీవితాలను వాస్తవికంగా చిత్రించె
    మంచిరచయిత.సమీక్షకుల వ్యాఖ్యానంతొ ఎకీభవిస్తున్నాను.--డా .రమణారావు.ముద్దు డాక్టర్కెశవరెడ్డిగారినవల సెరీల్గా వస్తుంటె చదివాను.మునెమ్మనవల మాత్రం
    వివాదాస్పదమైనది.రాయలసీమగ్రామీణజీవితాలను వాస్తవికంగా చిత్రించె
    మంచిరచయిత.సమీక్షకుల వ్యాఖ్యానంతొ ఎకీభవిస్తున్నాను.--డా .రమణారావు.ముద్దు డాక్టర్కెశవరెడ్డిగారినవల సెరీల్గా వస్తుంటె చదివాను.మునెమ్మనవల మాత్రం
    వివాదాస్పదమైనది.రాయలసీమగ్రామీణజీవితాలను వాస్తవికంగా చిత్రించె
    మంచిరచయిత.సమీక్షకుల వ్యాఖ్యానంతొ ఎకీభవిస్తున్నాను.--డా .రమణారావు.ముద్దు

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌