Wednesday, December 9, 2009

ప్రగతిశీల సమ్యక్‌ దృష్టే కథావరణం ,,,


సుప్రసిద్ద మళయాళ రచయిత, సాహితీ వైతాళికుడు వైక్కం మొహమ్మద్‌ బషీర్‌ కథలకి తెలుగు అనువాదం ఈ సంపుటి.
బషీర్‌కు దక్కిన గౌరవాదరాలు, పాఠకాభిమానం, ఆయన సాధించిన అనేక విజయాలు-లోక విదితం. సాహితీవేత్తగా బషీర్‌
లోచూపు, ముందుచూపు - రెండూ కూడా - ఆయన లక్ష్యశుద్ధిని తెలియజేస్తాయి. ముస్లిం సమాజంలోని ఛాందసత్వం
తెలివిలేమితనం వీటిపట్ల ఆయనకు గల సంవేదన ఆయన్ని ఆ సమాజంలోని వైకల్యాల్ని గురించి రాయటానికి
పురిగొల్పింది. ఆ సమాజ అభ్యుదయాన్ని కాంక్షించిన చిత్తశుద్ది కల రచయిత బషీర్‌.

ముస్లింలలో చైతన్యం తేవటమేకాక, అనేక అపోహల కారణంగా ముస్లిం సమాజంతో 'ఎలియనేట్‌' అయిపోయిన హిందువుల
మనోభావనల్లో సైతం మార్పు తేవటానికి ప్రయత్నించిన సాహితీకారుడు బషీర్‌. భిన్న వర్గాల మధ్య పరస్పర సహకారం,
సర్దుబాటు అవసరమనే ప్రగతిశీల భావ ప్రచారానికి కథానికని ఒక వాహికగా ఎన్నుకున్న రచయిత ఆయన.

ఈ సంపుటిలో 20 కథలున్నాయి. ఎక్కువ కథల్లో అంతర్లీనంగా అవాంఛనీయ సమాజిక స్థతిగతుల మీద సంధించిన వ్యంగ్యం ధ్వనిస్తూ వుంది. 'అదిగో పులి అంటే ఇదుగో తోక' తంతుగా సాగే 'విశ్వ విఖ్యాత ముక్కు' కథ చదివినా, 'ఒక ప్రేమ లేఖ', 'టైగర్‌' వంటి కథలు చూసినా ఈ వాస్తవం అర్థమవుతుంది. పరపీడన, దోపిడీ వర్గ సంఘర్షణ వంటి భావజాలం ....... వాస్తవికతలోకి దిగకుండా కళాత్మకతగా, బషీర్‌ కథాశిల్పగతం అయింది. అదే ఈ కథలకి వన్నె కూరుస్తున్న ప్రత్యేకాంశం.

'ఒక మనిషి' వంటి కథలోని మానవీయ కోణం చప్పున తెలుగులో బాలగంగాధర తిలక్‌ కథ 'దొంగ'ని స్ఫురింపజేస్తుంది.
చిన్నకథ. హోటల్లో కడుపు నిండా తిన్నాడు. పర్సు పోయింది. దారుణంగా అవమానించారు. చివరికి దాన్ని
కొట్టేసినవాడిలోనే మానవత్వం మేల్కొంది. బిల్లు కట్టటమే కాక, అతని పర్స్‌ అతనికిచ్చేశాడు. 'వెళ్లు. దేవుడు
చల్లగాచూడాలి' అన్నాడతను. 'నిన్ను దేవుడు చల్లగా చూడాలి' అన్నాను నేను!అంటూ కథ ముగుస్తుంది. అద్భుతమైన,
కరుణార్ద్రమైన కథానిక. నిష్కపటంగా, నిర్మలంగా హిందూ-ముస్లింల మతసామరస్యానికి దిశానిర్దేశం కూర్చే కథల్ని
అందించిన బషీర్‌ని చదవటం, ఈ సంక్షోభ వర్తమానంలో ఒక అనివార్య అవశ్యకత!

- విహారి
వార్త , ఆదివారం 8 నవంబరు 2009

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌