Wednesday, February 25, 2009

మునెమ్మ నవలపై జరిగిన చర్చ



ఇటీవల కత్తి మహేష్ కుమార్ గారు తన బ్లాగు పర్ణశాల లో మునెమ్మ నవలపై కాత్యాయని గారు సాక్షి దినపత్రికలో చేసిన విమర్శపై ఇలా స్పందించారు:


‘మునెమ్మ’ పై కాత్యాయని పైత్యం - కత్తి మహేష్ కుమార్


'మునెమ్మ' నవలపై కాత్యాయనిగారి సమీక్ష/విశ్లేషణ కూడా "రాసేవాళ్ళకు చదివేవాళ్ళెప్పుడూ లోకువే" అన్న నానుడిని స్థిరపరిచేదిగానే ఉంది.అందుకే, ఒక సాధారణ పాఠకుడిగా కాత్యాయనిగారు చేసిన ఈ అవమానాన్ని చూస్తూ సహించలేక ఈ స్పందనని అక్షరబద్ధం చేస్తున్నాను.

ఒక రచయిత యొక్క వర్గస్పృహ, సామాజిక ధృక్పధం, భావజాలం తను రచించే రచనలలో ఉండొచ్చునుగాక. కానీ, విమర్శకులు ఒక రచనని బేరిజు చేసేటప్పుడు రచయితనుకాక, ఆ రచనలోని సూచించిన ఆధారాలను మూలం చేసుకుని వాటిని ఎత్తిచూపే ప్రయత్నం చెయ్యాలి. అలాకాకుండా, ఉరుమురిమి మంగలం మీదపడ్డట్టు మొదటిపేరాలోనే డా" కేశవరెడ్డి "గొప్ప"తనాన్ని ఎద్దేవాచేసి. ఆయన "మార్క్సిస్టు నిష్ట" ను అపహాస్యం చేసి. పేద,దళితసమస్యలనే చురకత్తుల్ని జేబులోపెట్టుకు తిరుగుతాడనే అపవాదు మూటగట్టి. తదనంతరం అసలు విషయాన్ని ప్రారంభించడం కాత్యాయనిగారి bias ను సుస్పష్టంగా ఎత్తిచూఫూతోంది.ఒక పాఠకుడిగా ఇవన్నీ నాకు అప్రస్తుతాలు, అనవసరాలు.

పుస్తకం గురించి చెప్పకముందే కాత్యాయనిగారు విసిరిన మరొ రాయి, రచయిత "స్త్రీ సమస్యలపై సానుభూతితో తాజానవల 'మునెమ్మ' వెలువరించారు" అటూ రచయితకు లేని ఉద్దేశాన్ని ఆపాదించడం. 'జయప్రభ'గారు రాసిన ముందుమాటలో "అయ్యా! మీరచనల్లో స్త్రీపాత్రే ఉండవు. ఉన్నా వాటికి ప్రాధాన్యత ఉండదు. మీధృష్టిలో స్త్రీలకి ప్రాధాన్యత లేదా? లేక స్త్రీలని ముఖ్యపాత్రగా మలచి కథ రాయగల్గిన శల్తిమీకు లేదా? ఆడవాళ్ళంటే మీకేమన్నా భయమా??" అన్న ప్రశ్నలకి సమాధానంగా ఈ నవలను రాయటం జరిగిందన్న సూచన ఉంది. అంతేతప్ప, సమీక్షకురాలు ఆరోపించిన 'ఒంటరి స్త్రీల సమస్యలకు పరిష్కారాన్ని అందిచడానికి పూనుకున్నట్లు'గా కనీసం చూచాయగాకూడా చెప్పడం జరగలేదు.అలాంటప్పుడు, ఇంతటి ఆరితేరిన conclusion కి సమీక్షకురాలు ఎలా వచ్చిచేరారో అర్థంకాకుండా ఉంది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఈ సందర్భంగా ...
మునెమ్మ నవలపై సాక్షి దినపత్రికలో
13, 20, 27 అక్టోబర్ 2008 తేదీలలో జరిగిన చర్చ
...విమర్శకులకు నవలా రచయిత డాక్టర్ కేశవరెడ్డి గారు 03 నవంబర్ 2008 న
ఇచ్చిన సమాధానం తాలూకు లింకులను ఇక్కడ పొందుపరుస్తున్నాము:

1) రాసే వాళ్లకు చదివే వాళ్ళు లోకువ .........కాత్యాయని (సాక్షి 13-10-2008)
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=13035&Categoryid=1&subcatid=3

2) మునెమ్మ ఎవరిని జయించింది? ...... గోపిని కరుణాకర్ (సాక్షి 20-10-2008)
వికృత శిల్ప విన్యాసం ................. తెల్కపల్లి రవి (సాక్షి 20-10-2008)
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=13527&Categoryid=1&subcatid=3

3) అవును ఈ విమర్శకు రాలికి మేము లోకువే !! - డాక్టర్ భారతి (సాక్షి 27-10-2008)
ఒక అసంబద్ధ రచన .......... ఆర్ కే (సాక్షి 27-10-2008)
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=14010&Categoryid=1&subcatid=3

4) హిస్టీరియా రోగుల నుంచి సాహిత్యాన్ని కాపాడండి .... డాక్టర్ కేశవరెడ్డి గారి సమాధానం (సాక్షి 03-11-2008)
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=14390&Categoryid=1&subcatid=3



వెతకండి : సాక్షి దినపత్రిక ..... పాత సంచికలు .... తేది ... అభిప్రాయం (శీర్షిక)....సాహిత్యం ( ఉప శీర్షిక)

మునెమ్మ ... నవల
రచన: డా. కేశవరెడ్డి
తొలి పలుకు: జయప్రభ
మలి పలుకు: అంబటి సురేంద్రరాజు
ముఖచిత్రం: కాళ్ళ
111 పేజీలు, వెల రూ.40


ప్రతులకు, వివరాలకు :
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85 ,
బాలాజీ నగర్ , గుడి మల్కాపూర్ ,
హైదరాబాద్ - 500 067
ఆంద్ర ప్రదేశ్
ఫోన్ నెం. 040-2352 1849
.......................................

Tuesday, February 24, 2009

జమీల్యా - నాకు నచ్చిన ప్రేమకథ! ... పూర్ణిమ గారి సమీక్ష


పుస్తకం పై అట్ట మీదేమో ఒక అమ్మాయి బొమ్మ, వెనుకాలేమో “ప్రపంచంలోని బహుసుందరమైన ప్రేమకథల్లో ఒకటిగా గణుతికెక్కిన రచన” అన్న వాక్యం, అట్టకీ అట్టకీ మధ్య మహా అయితే ఓ వంద పేజీలు.. చూడ్డానికి చిట్టిగా, ప్రేమ కథ అంటూ విషయం ఘాటుగా ఉండడంతో “ఓ గంటలో అవ్వగొట్టేయచ్చు” అంటూ మొదలెట్టిన పుస్తకం ఇది.

చదవటం పూర్తవ్వగానే “అబ్బే.. ఇంతేనా?” అనిపించింది.

సమయం గడిచే కొద్దీ... పుస్తకం నాలో ఇంకుతున్న కొద్దీ... “అబ్బో.. చాలానే ఉంది” అనిపించింది.(...పుస్తకం...)

......... పుస్తకం డాట్ నెట్ లో పూర్ణిమ గారి సమీక్ష పూర్తిగా చదవండి........
http://pustakam.net/?p=551


జమీల్యా పుస్తకం లో ఉప్పల (వుప్పల) లక్ష్మణరావు గారి పేరు పుప్పల లక్ష్మణరావు అని పొరపాటుగా అచ్చయినందుకు చింతిస్తున్నాము. మలి ముద్రణ లో ఈ పొరపాటును సవరించడం జరుగుతుంది.
పూర్ణిమ గారికి, పుస్తకం డాట్ నెట్ వారికీ కృతజ్ఞతలతో

- హైదరాబాద్ బుక్ ట్రస్ట్

Wednesday, February 18, 2009

ఇట్లు ఒక రైతు ... గొర్రెపాటి నరేంద్రనాథ్‌ ...







స్వానుభవాలను స్వగతంలో చెబితే లేదా రాస్తే
ఏ విషయమైనా ఆసక్తికరంగా వుంటుంది.
మనసుకు హత్తుకుపోతుంది.

గొర్రెపాటి నరేంద్రనాథ్‌ రాసిన పుస్తకం ''ఇట్లు ఒక రైతు'' ఆద్యంతమూ ఆసక్తికరంగా వుంది.

పుస్తకం చదవడం ఆరంభిస్తే, అయిపోయేంతవరకు వదలిపెట్టడానికి బుద్ధి పుట్టదు.

నరేంద్రనాథ్‌ 'ఇట్లు ఒక రైతు' అని అన్నారు.
కానీ నిజానికి ఇది రైతులందరి గొడవే.
లక్షలాది మంది ఘోషను తన గొంతు ద్వారా వినిపించారు.

''సేద్యంలో నా గొడవ'' అని రాసుకున్నారు.
అయితే, సేద్యంతో పాటు అనేక ముఖ్యమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక
అంశాలను ఈ పుస్తకంలో విశ్లేషించారు.

నగరంలో పుట్టి పెరిగినవాడూ, విద్యాధికుడూ అయిన యువకుడు పల్లెబాట పట్టాడంటే నిజంగా ఇది ఎంతో ఆదర్శవంతమైనది, స్ఫూర్తి దాయకమయినది.

స్వగ్రామంలో నరేంద్రనాథ్‌ గత ఇరవై ఏళ్లుగా సేద్యంలో ఎన్నో ప్రయోగాలు చేశారు.
తన చుట్టూ వున్న జనం, ముఖ్యంగా, పేద వర్గాల వారి అభ్యున్నతికి, సామాజిక మార్పు కోసం ఎంతో కృషి చేశారు.
ఈ అంశాలనన్నింటినీ ఆయన ఈ పుస్తకంలో వివరించారు.

రైతుల ఆత్మహత్యలు, నిర్వాసిత సమస్య, గిట్టుబాటు కాని సేద్యం, జలయజ్ఞం (ధన యజ్ఞం?), పేదలకు సాగుభూమి, రాష్ట్రాన్ని సారాంధ్రప్రదేశ్‌గా మార్చటం మొదలైన అంశాలన్నీ ఆయన్ను వేదనకు గురిచేస్తున్నాయి.
జనాన్ని నిరాశలో పడేస్తున్నాయి.
ఆ నిరాశను ఆశగా మార్చడానికి ఈ పుస్తకం దోహదపడుతుందని ఆశిద్దాం.

-ప్రొఫెసర్‌ కె. ఆర్‌. చౌదరి (ముందుమాట నుంచి)
....................................................


గొర్రెపాటి నరేంద్రనాథ్‌ కి వ్యవసాయన్నా, ప్రజా ఉద్యమాలన్నా ఎనలేని మక్కువ.
ప్రత్యామ్నాయ ప్రజా ఉద్యమాలకు ఊతమిచ్చే ''లోకాయన్‌'' అనే సంస్థతో కలసి పనిచేసేందుకు గాను ఆయన ఢిల్లీలో తన బ్యాంక్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి సైతం రాజీనామా చేశారు.

ఆ తరువాత చిత్తూరు జిల్లాలోని పాకాల వద్దగల తన స్వగ్రామం వెంకటరామాపురంకు వెళ్లి సేంద్రీయ వ్యవసాయ, మొదలుపెట్టారు.

గత రెండు దశాబ్దాలుగా ఒకపక్క రైతుగా సేంద్రీయ వ్యవసాయం చేస్తూనే మరోపక్క అంటరానితనంపై, భూ సమస్యలపై, నిర్వాసితుల పునరావాసంపై, రైతు సమస్యలపై ఎంతో కృషి చేశారు.
ఆయన ఎన్‌ఎపిఎం, హెచ్‌ఆర్‌ఎఫ్‌, రాష్ట్రీయ రైతు సేవా సమితి వంటి సంస్థల్లో పనిచేస్తున్నారు.

సేంద్రీయ వ్యవసాయదారుడిగా మారిన నరేంద్రనాథ్‌ చేసిన ప్రయోగాలు,
సాధించిన ఫలితాలు, వ్యవసాయంలోని మంచిచెడు అనుభవాల సమాహారమే ఈ పుస్తకం.

తన జీవితంలోని ఆసక్తికరైన విషయాలను ప్రస్తావిస్తూనే
సేంద్రీయ వ్యవసాయ ప్రాధాన్యతను,
వ్యవసాయ రంగపు సాధక బాధకాలను,
పల్లె జీవితంలోని ఒడిదుడుకులను ఆయన ఈ పుస్తకంలో కళ్లకు కట్టినట్టు వివరించారు.

రైతులకూ,
వ్యవసాయరంగం పట్ల ఆసక్తి వున్నవారికే కాక -
క్షీణిస్తున్న పర్యావరణం గురించి,
తరుగుతున్న సహజ వనరుల గురించి ఆందోళన చెందుతున్న వారికీ,
తాము తింటున్న ఆహారం మంచిదో చెడ్డదో తెలుసుకోవాలనుకునే వారికి
ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుంది.



ఇట్లు
ఒక రైతు

-గొర్రెపాటి నరేంద్రనాథ్‌

మొదటి ముద్రణ: ఫిబ్రవరి 2009

138 పేజీలు, వెల: రూ.60

ప్రతులకు, వివరాలకు:


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడి మల్లాపూర్‌,
హైదరాబాద్‌ - 500028
ఫోన్‌ నెం. 040-2352 1849


...................................

Tuesday, February 17, 2009

పగిలిన అద్దం ... ముక్తవరం పార్థసారథి ...


ప్రముఖ వ్యక్తులు, ముఖ్యంగా రచయితల గురించిన సంక్షిప్త పరిచయాలివి.

ఒకరిద్దరు తప్ప అంతా పాతతరం వాళ్లే.

క్రిస్టఫర్‌ కాడ్వెల్‌,
కార్ల్‌ మార్క్స్‌,
చార్లీ చాప్లిన్‌,
మార్క్‌ ట్వేన్‌,
హిట్లర్‌,
చెహోవ్‌,
మపాసా,
విక్టర్‌ హ్యూగో,
ఓ హెన్రీ,
లూ సన్‌,
జాక్‌ లండన్‌,
ఆస్కార్‌ వైల్డ్‌,
చాల్స్‌ డికెన్స్‌,
మాక్సిం గోర్కీ వంటి 35 మంది ప్రపంచ ప్రఖ్యాత
వ్యక్తుల జీవన రేఖలు ఇందులో వున్నాయి.

ఆంధ్ర ప్రభ దినపత్రికలో ఏడాదికి పైగా వచ్చిన వీక్లీ కాలం ''పగిలిన అద్ధం''
లోంచి ఎంపిక చేసిన రచనలివి.

ముక్తవరం పార్థ సారథి నవలాకారుడు, కథకుడు, అనువాదకుడిగా తెలుగు పాఠకలోకానికి సుపరిచితుడు.

సాహితీ ప్రియులకు ఇవి ఏమేరకు ఉపయోగపడినా మా ప్రయత్నం ఫలించినట్టే.

పగిలిన అద్ధం
-ముక్తవరం పార్థసారథి

76 పేజీలు, వెల: రూ.20


ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడి మల్లాపూర్‌,
హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ నెం. 040-23521849

..................................

Saturday, February 14, 2009

పెరియార్‌ దృష్టిలో ఇస్లాం ... జి. అ లాయ్‌సియస్‌ ... తెలుగు అనువాదం: ప్రభాకర్‌ మందార ...


పెరియార్‌ ఇ.వి.రామస్వామి నాయకర్‌ (1879 - 1973) పేరు వినగానే చాలా మందికి ఒక కరడు గట్టిన ''నాస్తికుడు'' అన్న భావన కలుగుతుంది.

అయితే ఆయన దేవుడిని నమ్మని మాట, ప్రత్యేకించి రకరకాల రూపాల్లో అసంఖ్యాకంగా వున్న హిందూ దేవుళ్లని ఏవగించుకున్న మాట నిజమే అయినా పెరియార్‌ లక్ష్యం నాస్తికత్వ ప్రచారం కానేకాదు.

ఈ దేశ ప్రజల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించడం, వారి మధ్య సామాజిక ఆర్థిక సమానత్వాన్ని సాధించడం బ్రాహ్మణీయ కులవ్యవస్థనూ, దోపిడీమయమైన సాంప్రదాయాలనూ నిర్మూలించడం ఆయన ధ్యేయం.

హిందూమతం ఆపాదించిన తరతరాల బానిసత్వాన్ని వదిలించుకునేందుకు ''దేవుడు ఒక్కడే - మనుషులంతా ఒక్కటే'' అని చాటే ఇస్లాం మతంలో చేరడం మంచిదని బోధించాడు. ఆయన భావాలు, ఆలోచనలు ఎప్పుడూ సంచలనమే.

ఇస్లాంపై పెరియార్‌ అభిమానానికి, హిందూమతంపై ఏవగింపుకి కారణం ఏమిటో తెలుసుకునేందుకు ఈ చిన్న పుస్తకం ఎంతగానో దోహదపడుతుంది.

ఇందులోని అధ్యాయాలు:
1. అంటరానివాళ్లు ముస్లింలుగా మారిపోవాలి!
2. ద్రావిడుల జాతిపరమైన నీచ స్థాయికి సరైన విరుగుడు ఇస్లామే!
3. ఇస్లాంలో ఎందుకు చేరాలి?
4. శూద్రుడిగా మిగిలిపోయినందుకు నేను సిగ్గుపడుతున్నాను.
5. మహమ్మద్‌ నబీ కోసం ఓ ఉత్సవం.
7. దేవుడు-మతం.
8. ముస్లింలుగా మారిన ఆరుగురు తమిళనాడు దళితులు.

ఈ పుస్తక రచయిత జి. అ లాయ్‌సియస్‌ న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వీరు రాసిన '' నేషనలిజం వితౌట్‌ ఎ నేషన్‌ ఇన్‌ ఇండియా '' పుస్తకంతో పాటు ఇతర పుస్తకాలు ఎంతో ఆసక్తిని రేకెత్తించాయి.

పెరియార్‌ దృష్టిలో ఇస్లాం
కూర్పు: జి. అ లాయ్‌సియస్‌
ఆంగ్ల మూలం: Periyar on Islam, G. Aloysius, Critical Quest, New Delhi, 2004

తెలుగు అనువాదం: ప్రభాకర్‌ మందార

40 పేజీలు, వెల: రూ.40

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడి మల్కాపూర్,
హైదరాబాద్ - 500 067
ఫోన్ : 040-2352 1849

....................

Tuesday, February 10, 2009

వ్యవసాయంలో సంక్షోభం పత్తి విషాధగాథ ...- ఉజ్ర, రామాంజనేయులు, లావణ్య, రామారావు, సురేష్‌, రామకృష్ణ


ప్రస్తుత పరిణామాలు సామాన్య ప్రజల జీవితాలను కష్టతరం చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.

ఆధునిక విజ్ఞానం నేల, నీరు, గాలిని విషపూరితం చేస్తూ పేద ప్రజలను పణంగా పెట్టి పెద్ద పెద్ద కంపెనీలకు లాభాలు సమకూరుస్తోంది.
ప్రజలు నిస్సహాయులుగా, దిక్కు తోచక ఉండిపోతున్నారు.

తెలంగాణాలో పత్తిరైతుల ఆత్మహత్యలతో ఈ సమస్యల తీవ్రత ముందుకొచ్చింది.

ఈ ఆత్మహత్యలు జరిగిన కొన్ని గ్రామాలను రామూ, లావణ్య, రామారావు, ఉజ్రమ్మలు సందర్శించి సమస్యలకు గురైన కుటుంబ సభ్యులతో, ఇతరులతో మాట్లాడారు.
పత్తిసాగు గురించి, ప్రత్యేకించి పురుగులయాజమాన్యం గురించి సమాచారం కోసం చూస్తున్నామని గ్రామస్తులు చెప్పారు.
ఈ సమాచారం సేకరించి రైతులతో చర్చించాలని బృందం నిర్ణయించింది.
ఇందులో అందరూ పాలు పంచుకున్నారు.
అధిక భాగాలు రామూ, లావణ్య, రామకృష్ణ రాయగా సురేష్‌ ఎడిట్‌ చేసి ఖాళీలు పూరించారు.
ఈ సమాచారం సేకరించే సమయంలో తొలుత కష్టమనిపించినప్పటికీ రైతుల జీవితాలను క్రమేపీ మెరుగు పరిచే ఇతర విధానాలను ఎలా ఆచరణలోకి తీసుకురావాలో చర్చించారు.

తెలంగాణా రైతులతో తమ సంబంధాలను కొనసాగించి వారితో కలిసి నవిష్యత్తు ప్రణాళికలు రూపొందించాలన్న ప్రయత్నంలో భాగమే ఈ పుస్తకం.

ఇందులోని శీర్షికలు:
1. తెలంగాణాలో ఆత్మహత్యలు - మా పరిశీలన
2. పురుగు మందులు
3. సమగ్ర సస్య రక్షణ: అవగాహన, పరిమితులు
4. విత్తనం - రైతుహక్కు
5. విత్తనాల మార్కెట్‌పై పట్టు భిగిస్తున్న కంపెనీలు
6. పట్టుకోల్పోతున్న ప్రభుత్వ రంగ వ్యవసాయ పరిశోధన
7. వ్యవసాయ ప్రగతి - సమీక్ష
8. భారతదేశంలో పత్తిసాగు, వినియోగం, పరిశోధనలు
9. పత్తి విషాధ గాథ
10. దశాబ్దం క్రితం ప్రకాశం గుంటూరు జిల్లాల అనుభవం
11. పత్తిపై ఆందోళన - ప్రజల పర్యావరణ

హైదరాబాదులో ఉంటున్న కొందరి ఉమ్మడి చర్చల ఫలితమిది.

... రామారావు సివిల్‌ ఇంజనీరు.
... రామాంజనేయులు, లావణ్యలు వ్యవసాయ శాస్త్రవేత్తలు.
... సురేష్‌ వ్యవసాయ పట్టభద్రుడు.
... ఉజ్ర దస్తకార్‌ సంస్థలో ఉన్నారు.
... రామకృష్ణ పురుగు మందుల కంపెనీ ఉద్యోగం వదిలిపెట్టి సి.డబ్ల్యు.ఎస్‌.లో పురుగుమందులు లేని పురుగుల యాజమాన్య పద్ధతిపై కృషి చేస్తున్నారు.


వ్యవసాయంలో సంక్షోభం-పత్తి విషాధ గాథ
-రామారావు, రామాంజనేయులు, లావణ్య, రామకృష్ణ, సురేష్‌, ఉజ్ర.
ప్రథమ ముద్రణ: 1999
86 పేజీలు, వెల: రూ.20

....................

Sunday, February 8, 2009

ఎగిరే క్లాస్‌ రూమ్‌ ...జర్మన్‌ రచన: ఎరిక్‌ కాస్ట్‌నర్‌...తెలుగు అనువాదం: బి.వి.సింగరాచార్య



... రెక్కలు చాచిన బాల్యం ...

పిల్లల కోసం రాసిన పుస్తకాల్లో పబ్లిషర్లు అయస్కాంతం ముక్కలేమైనా అతికించి పెడతారేమో.
లేకపోతే కొన్ని పుస్తకాలు మన చేతులకు, కళ్లకు, ఆపైన మనసుకు అంత గట్టిగా ఎలా అతుక్కుపోతాయి?

'' ఎగిరే క్లాస్‌ రూం '' లో అ లాంటి ఒక అయస్కాంతం ముక్క కచ్చితంగా వుంది.
ఎరిక్‌ కాస్ట్‌నర్‌ అనే జర్మన్‌ రచయిత 75 ఏళ్ల క్రితం బాల్యానికి, పిల్లల స్నేహానికి ఇచ్చిన గొప్ప గౌరవం ఇది.
బి.వి.సింగరాచార్య దీన్ని నేరుగా జర్మన్‌ నుంచి అనువాదం చేయడం మన అదృష్టం.

అయితే 40 ఏళ్ల క్రితం పుస్తకంగా వచ్చి కూడా నిన్న మొన్నటి వరకు ఎవరికీ అందుబాటులో లేకపోవడం మాత్రం మనందరి దురదృష్టం.

బుగుడులా, టామ్‌ సాయర్‌ లా ఇందులోని పిల్లలందరూ మనకు ఎప్పటికీ గుర్తుండిపోతారు.
ఎంతో ఆత్మీయంగా అనిపిస్తారు.
అసలు వాళ్లలో వున్నది మనమే అనుకుంటాం.

ప్రత్యర్థి విద్యార్థుల్ని బందీలుగా పట్టుకుపోవడం, వాళ్ల ఎక్సర్‌సైజు పుస్తకాలను ఎత్తుకుపోవడం, వాటికోసం మంచు ముద్దలతో యుద్ధాలు, గాయాలు, అయినా విషయం టీచర్ల దాకా వెళ్లకుండా విద్యార్థి గౌరవాన్ని నిలబెడుతూ తమలో తామే పరిష్కరించుకోవడం... ఇన్ని వున్నాయి ఇందులో.

ఒట్టి అ ల్లరే కాదు పేదరికాన్ని కప్పి పెట్టేందుకు పెట్టుకున్న కన్నీళ్లు, పిరికితనం నుంచి బయటపడడానికి చేసే పెను సాహసాలు, కొందరు టీచర్లంటే ప్రత్యేక అభిమానాలు, స్నేహాలు, వైఫల్యాలు ... ఇవీ వున్నాయి చాలానే.

ఇంత మంచి పుస్తకం రాసిన ఎరిక్‌ కాస్టనర్‌ని నాజీలు చాలా ఇబ్బందులపాలు చేశారంటే, ఈ పుస్తకాల ప్రతులను సైతం తగలబెట్టారంటే ఎంత నాజీలైతే మాత్రం బాల్యాన్ని కూడా బతకనివ్వరా, కాల్చిపడేస్తారా అని ఒళ్లు మండిపోతుంది మనకి.

అనువాద ప్రతిని జాగ్రత్తగా దాచి హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌కు అందించిన చిత్రకారుడు అన్వర్‌కు ప్రత్యేక అభినందనలు.

- వసంత

(...ఆదివారం ఆంధ్రజ్యోతి, 8 ఫిబ్రవరి 2009 సౌజన్యంతో ... )



ఎగిరే క్లాస్‌రూమ్‌
- ఎరిక్‌ కాస్ట్‌నర్‌

తెలుగు అనువాదం: బి.వి.సింగరాచార్య

పేజీలు : 162, వెల: రూ.70


ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్ నెం. 85 ,
బాలాజీ నగర్ , గుడి మల్కాపూర్ ,
హైదరాబాద్ - 500 067
ఆంద్ర ప్రదేశ్
ఫోన్ నెం. 040-2352 1849

.......................................

Monday, February 2, 2009

ఆలోచించండి...... డాక్టర్‌ కె. మిత్రా


తేలిగ్గా అర్థమై, హాయిగా చదివించే తర్కబద్ధమైన శైలి డాక్టర్‌ మిత్రాది.

వీరి వ్యాసాలు తొలుత 1971 ప్రాంతంలో 'వసుధ' అనే మాస పత్రికలో అచ్చయినప్పుడే పాఠకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆలోచింపజేశాయి.

ఆతరువాత మరి రెండు సార్లు పుస్తక రూపంలో అచ్చయ్యాయి.
ఇవి వాటిలోని కొన్ని ముఖ్యమైన వ్యాసాలు.

ప్రజల్లో పాతుకుపోయిన మూఢ విశ్వాసాలను శాస్త్ర విజ్ఞాన సహాయంతో తొలగించడం విజ్ఞానవంతుల కర్తవ్యం.

అయితే మన దేశంలో చదువుకున్నవారే.... మేధావులు అనిపించుకుంటున్నవారే.... ఈ మూఢవిశ్వాసాలను పెంచి పోషించటం విచారకరం.
శాస్త్రీయ దృష్టిలేని శాస్త్రవేత్తలే తలతిక్క తర్కాలతో పాత మూఢవిశ్వాసాలకు కొత్త బలాన్ని కల్పిస్తున్నారు.

ఈ దుష్ప్రభావాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజల్లో విజ్ఞాన వ్యాప్తికి కృషి చేస్తున్న హేతువాదులు డాక్టర్‌ మిత్రా.

మానవ సమాజాభివృద్ధి క్రమాన్ని గతితార్కిక పద్ధతిలో విశ్లేషించిన మార్క్సస్టు హేతువాదం వారిది. ఆ సిద్ధాంత బలంతోనే వారు ఈ వ్యాసాలు రాశారు.

చిరు పుస్తకంలో...

1. సత్య సాయిబాబాతో మూడు మాసాలు.
2. దెయ్యాలు - పిండాకూడు.
3. మోక్షం.
4. మత శవానికి శాస్త్ర జ్ఞాన భూషణాలు వ్యర్థం.

అనే నాలుగు వ్యాసాలున్నాయి.


ఆలోచించండి
- డాక్టర్‌ మిత్రా

ప్రథమ ముద్రణ: 1989
ద్వితీయ ముద్రణ: 2000

20 పేజీలు, వెల: రూ.6


,,,,,,,,,,,,,,,,

Sunday, February 1, 2009

ఆర్థిక సంస్కరణలు - సంక్షేమాలకు అందని ప్రజలు - కె.ఎస్‌.చలం


....మన దేశంలో ఆర్థిక సంస్కరణలని 1991లో అధికారికంగా ప్రారంభించారు.
ప్రభుత్వాలు మారినప్పటికీ ఆర్థిక సరళీకరణ విధానాల విషయంలో పాలక పక్షాల్లో ఎలాంటి విభేదాలు కనిపించడంలేదు.
కొద్ది మంది కమ్యూనిస్టులు మినహాయిస్తే దాదాపు అన్ని పార్టీలవారూ ఆర్థిక సంస్కరణలను రెండు చేతులా ఆహ్వానిస్తున్నారు లేదా
వ్యూహాత్మకంగా మౌనాన్ని పాటిస్తున్నారు.

... ఈ ఆర్థిక సంస్కరణల అసలు లక్ష్యం ఏమిటి?

... వీటివల్ల ఎవరికి ఎక్కువ లబ్ది కలుగుతుంది?

... వీటి దుష్ప్రభావం నుంచి కాపాడే ఉద్దేశంతో ప్రభుత్వం కంటితుడుపుగా అమలు పరుస్తున్న గుప్పెడు సాంఘిక సంక్షేమ
కార్యక్రమాలు, సబ్సిడీలు బలహీనవర్గాల వారిని ఎంత వరకు ఉద్ధరిస్తున్నాయి?


తదితర ప్రశ్నలకు సమాధానలు వెదికేందుకు చేసిన ప్రయత్నమే ఈ చిన్న పుస్తకం.

ప్రపంచంలో మరే ఇతర దేశంలోనూలేనటువంటి ఒక విలక్షణమైన కుల వ్యవస్థ మన దేశంలో వేళ్లూనుకుని వుంది.

తత్ఫలితంగా షెడ్యూల్డ్‌ కులాలు, ఆదివాసీలు, బలహీనవర్గాలు, గ్రామీణ చేతివృత్తుల పనివారు, పట్టణ ప్రాంత పారిశ్రామిక కార్మికలు,
దళిత మహిళలు మొదలైనవారిపై ఆర్థిక సంస్కరణల దుష్ప్రభావం అమితంగా వుంది.

విద్య, పారిశ్రామిక రంగాలు ఎంత వేగంగా ప్రైవేటీకరణకు గురవుతున్నాయో ఎస్‌సి, ఎస్‌టి, బిసి కులాల వారు అంత వేగంగా తమ
హక్కుల్ని, అభివృద్ధి అవకాశాలని కోల్పోతున్నారు.

రిజర్వేషన్‌ విధానమే తన ప్రాథాన్యతను కోల్పోతోంది.

మరోపక్క అగ్రకులాలకూ, అగ్రవర్గాలకే అన్ని అవకాశాలు పరిమితమైపోతూ సామాజిక వైరుధ్యాలు పెరిగిపోతున్నాయి.

ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ కె.ఎస్‌.చలం ఆంధ్ర యూనివర్సిటీలో అకాడమిక్‌ స్టాఫ్‌ కాలేజ్‌ డైరెక్టర్‌గా వున్నారు. ఇటీవల వస్తున్న
దళిత, ప్రత్యామ్నాయ చరిత్ర, ఆర్థిక విధానాలు, కుల సంఘాలు, ఆర్థిక శాస్త్రం, విద్య తదితర అంశాలపై లోతైన ఆధ్యయనాలు చేశారు.

ఆర్థిక సంస్కరణలు - సంక్షేమాలకు అందని ప్రజలు
- కె.ఎస్‌. చలం

ఆంగ్గ్ల మూలం: Economic Reforms and the Missing Safety Nets, Vikas Adhyayan Kendra, Mumbai, 1999.

అనువాదం: కలేకూరి ప్రసాద్‌
ప్రథమ ముద్రణ: 1999
51 పేజీలు, వెల: రూ.15


......................

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌