Thursday, December 4, 2008

ఒక ఆదివాసీ వీరుడి కథ : కొమురం భీం (నవల)... రచన: భూపాల్‌




ప్రస్తుత ప్రపంచీకరణ వాతావరణంలో మన పిల్లలు మన మూలాలకు దూరమైపోతున్నారు...

సినిమా తారల, కూల్‌ డ్రింక్‌ల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ఆధునిక మీడియా అనునిత్యం వారిని 'అ లరిస్తోంది'. వలస ధోరణులను పెంచేందుకు
ఉద్దేశించిన ఈ చట్రాల నుంచి బయటపడేందుకు మనం మన మూలాలకు, ముఖ్యంగా మన ప్రజల మూలాలకు చేరువ కావాల్సిన అవసరం
వుంది....

మన గడ్డపై వీరోచితమైన పోరాటాలు సాగించి, ఇప్పుడు దాదాపుగా జానపదుల గాధల్లో మిగిలిపోతున్న మన వారి కథల్ని పిల్లలకూ (పెద్దలకూ
కూడా) అందించే ఉద్దేశ్యంతో ఈ ''పిల్లల కోసం'' సిరీస్‌ను వెలువరిస్తున్నాం.

నిజాం నిరంకుశ పాలనకు వ్యతికేకంగా అడవుల్నీ, ఆదివాసీ ప్రజల్నీ కదిలించిన ఆదిలాబాద్‌ జిల్లా గోండు పోరాట నాయకులు ఈ కొమురం భీం
కథ ఈ సిరీస్‌లో మొదటిది.

..............................................................

ఒక ఆదివాసీ వీరుడి కథ


మన రాష్ట్రంలో ఆదిలాబాద్‌ జిల్లా పురాణ కాలపు భీముడు, హిడింబల రాజ్యమని ప్రతీతి.
ఇప్పటి గోండు జాతి సోదరీ సోదరులు వాళ్ల వంశీకులే అంటారు.
ఆ ప్రాంతాన్ని గోండులు పరిపాలించినట్టు చారిత్రక రుజువులున్నాయి.
జనహిత పాలన వాళ్లది.
మైదాన ప్రాంతాన్నుంచి వచ్చిన షావుకార్లు బిస్కట్లు, మురుకులు, ఉప్పు, దువ్వెన్లు, తదితర వస్తువులను వస్తుమార్పిడి పద్ధతిలో అమ్ముతూ
గోండులను నిలువుదోపిడీ చేసేవారు..
దోసెడు ఉప్పు ఇచ్చి గోండుల నుంచి ఇరవై రెండు కిలోల కందులు తీసుకునేవారు.
ఆదివాసీలు అమాయకులు. వాళ్లకు చదువురాదు, లెక్కలు తెలియవు. ధర్మ పథం తప్పనివాళ్లు వారు.
వాళ్ల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మైదాన ప్రాంత వ్యాపారస్థులు అప్పుల పేరుతో ఆదివాసీల పంటలు, మేకలు, ఇతర జంతువులను
స్వాధీనం చేసుకునేవారు. చివరికి గోండుల చేత తమ ఇళ్లల్లో వెట్టి చాకిరీ చేయించుకునేవారు.

ఆ తర్వాత నైజాం రాజోద్యోగులు వాళ్లని పన్నుల పేరిట నానా రకాలుగా హింసించేవారు. అట్లాంటి దారుణమైన వాతావరణంలో ఓ గోండు
కుటుంబంలో జన్మించాడు కొమురం భీము.
ఆదివాసీలందరికీ భీం కుటుంబమే పెద్దదిక్కు. కొమురం భీం తన పూర్వీకుల వీరోచిత గాథలు వింటూ పెరిగాడు. వాళ్ల వదిన భీం కు
చిన్నప్పటినుంచే వీర గాథల్ని చెప్తూ అతని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది.

కూసే కూకు కూకూ (కూసే కోకిల కూకూ)
కేడా మావయి కూకూ (అడవి మనది కూకూ)
బీడూ మావయి కూకూ (బీడూ మనది కూకూ)
గోండు రాజ్యం కూకూ
మైసి వాకట్‌ కూకూ (గెలిచీ వస్తాం కూకూ)
తుడుం అంకత్‌ కూకూ (తడుం మోగించాలి కూకూ)
సచ్చుల దేశం కూకూ (మొత్తం దేశం కూకూ)
మైసి వాకట్‌ కూకూ (గెలిచీ వస్తాం కూకూ)


భీం వదిన కుకూ బాయి ఎప్పుడూ పాడే ఈ పాట అతణ్ని అమితంగా ప్రభావితం చేసింది.
'' వదినా ఈ నీళ్లు మనవి... ఈ గాలి మనది... ఈ ఎండ మనది... ఈ ఆకాశం మనది... మరి ఈ అడవి మనదెందుకు కాదు ? మన అడవి,
మన నేల, వాళ్లదెట్లా అయింది? '' అని అడిగేవాడు భీం.

ఆదివాసీలు పోడు వ్యవసాయం చేస్తూ తమ పంటల్ని రక్షించుకునేందుకు ప్రాణాలకు తెగించి అడవి మృగాలతో పోరాడుతుంటారు.
కానీ పంటలు చేతికందే సమయానికి నైజాం ప్రభుత్వ మానవ మృగాలు విరుచుకుపడి పంటలన్నింటినీ ఊడ్చుకుపోతుంటారు. కోళ్లను, మేకలను,
గొర్రెలను ఎత్తుకుపోతారు. ఎదురుతిరిగిన వాళ్ల చిత్రహింసలకు గురిచేస్తారు, వారిపై అక్రమ కేసులు బనాయిస్తుంటారు. గూడేలకు గూడేలనే
తగులబెడ్తుంటారు.

ఈ అన్యాయాలను సహించలేక కొమురం భీం తిరుగుబాటు బాటపడ్తాడు. ఆ క్రమంలో శత్రుపక్షంలో ఒకడ్ని చంపేస్తాడు. శత్రువులకు చిక్కకుండా
తప్పించుకునేందుకు గూడెంను వదిలి దేశాటన చేస్తాడు.

బతుకు గమనంలో అక్షరం నేర్చుకుంటాడు. భాషలు నేర్చుకుంటాడు. ఉద్యమాలతో అతనికి పరిచయం కలుగుతుంది. అ ల్లూరి సీతారామరాజు
వీరోచిత గాథ విని ఉత్తేజం పొందుతాడు. ఆ చైతన్యంతో తిరిగి తన ఊరుకు చేరుకుని తోటి ఆదివాసీలను చైతన్యపరుస్తాడు. తనవాళ్లని స్వేచ్ఛా
స్వాతంత్య్రం దిశలో నడిపిస్తాడు.

మొదట తమ సమస్యల పరిష్కారానికి సాత్వికంగా సర్కారుకు విన్నపాలు సమర్పిస్తాడు. కానీ సర్కారు ఆ విన్నపాలను బుట్టదాఖలు చేసి
అణచివేత మార్గాన్ని అనుసరిస్తుంది. దాంతో ఇక లాభం లేదని యుద్ధానికి సిద్ధమవుతాడు కొమురం భీం. సర్కారుతో అరివీర భయంకరంగా
పోరాడి పాక్షిక విజయం సాధిస్తాడు. అయితే నైజాం సర్కారు ఆయుధ సంపత్తి ముందు ఎక్కువ కాలం నిలబడలేకపోతాడు. పైగా స్వపక్షంలో
కొందరు ద్రోహులు వెన్నుపోటు పొడవడంతో కొమురం భీం ఆ వీరోచిత పోరాటంలో అమరుడవుతాతు.

కొమురం భీం జానపద హీరో కాదు. ఓ చారిత్రక రోల్‌ మాడల్‌ మాత్రమే కాదు. నేటికీ జనం గుండెల్లో సజీవంగా వున్న యోధుడు. ఆ పల్లె
ప్రాంతాల్లో ఇప్పటికీ ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఆయన వీర గాథను వినిపిస్తూనే వుంటారు.

ఆయనపై అనేక పుస్తకాలు వచ్చాయి. అయితే భూపాల్‌ అందించిన ఈ పుస్తకం ఎంతో విలక్షణమైనది. విశిష్టమైనది. జన నాట్య మండలి
కార్యకర్తగా, సారథ్య శ్రేణిలో ముఖ్యుడిగా ఆయన అందరికీ సుపరిచితుడు. (కొమురం భీంపై నిర్మించిన సినిమాలో కూడా ఆయన ముఖ్య పాత్రను
పోషించారు). రేపటి పౌరులను ప్రయోజనాత్మక బాటలో తీర్చిదిద్దాలన్నది ఆయన ఆశయం. అందుకే పిల్లల స్థాయికి ఒదిగి వాళ్ల టోన్‌లోనే ఎంతో
ఆసక్తిని రేకెత్తించేవిధంగా చెప్పుకెళతాడీ కథనాన్ని.

తల్లిదండ్రులు తమ పిల్లలకు చాక్లెట్లో, మరొకటో గాక అప్పుడప్పుడు ఇట్లాంటి పుస్తకాలు కొనిస్తే వాళ్లు టీవీలను వొదిలి నిజమైన ప్రపంచం గురించి
తెలుసుకుంటారు. మానవీయ విలువలతో ఎదుగుతారు.

(ఆంధ్రభూమిలో వెలువడిన పుస్తక సమీక్ష నుండి)
.....................................................




కొమురం భీం
ఒక ఆదివాసీ వీరుడి కథ
రచన: భూపాల్‌

బొమ్మలు : ఏలే లక్ష్మణ్‌

63 పేజీలు, వెల : రూ.25
.............................

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌